చివరి షెడ్యూల్‌ జరుపుకుంటున్న జీ5 'గాలివాన' వెబ్‌ సిరీస్‌

  • IndiaGlitz, [Tuesday,February 01 2022]

‘జీ 5’... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ప్రతి నెలా ఒక కొత్త వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘గాలివాన’ పేరుతో ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తోంది. బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ రాధిక శరత్‌ కుమార్‌, హీరో సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్‌ కుమార్‌ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్‌ కుమార్‌, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ వెబ్‌ సిరీస్‌తో బిబిసి రీజనల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది అని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ‘జీ 5’ సంస్థలు తెలిపాయి. ‘తిమ్మరుసు’ ఫేమ్‌ శరణ్‌ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రాంతీయ టెలికాం శిక్షణా కేంద్రంలో షూటింగ్‌ జరుపుకుంటోంది. మంగళవారం ఆన్‌ లొకేషన్‌ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...

సీనియర్‌ నటి రాధిక గారు మాట్లాడుతూ.. శరత్‌ మరార్‌ గారిని చిరంజీవి గారితో చాలాసార్లు చూశాను. ఆయన నన్ను కలిసి వెబ్‌ సిరీస్‌ కథ చెప్పడం జరిగింది. నేను ఇప్పటివరకు ఏ భాషలోనూ వెబ్‌ సిరీస్‌ చేయలేదు. కథ నచ్చడంతో ఈ గాలివాన వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్‌ చాలా చక్కగా కుదిరాయి. మంచి ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌. ఇంతమంచి ప్రాజెక్టులో వర్క్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను డబ్బింగ్‌ చెప్పేటప్పుడు చూశాను. అన్ని పాత్రలూ చక్కగా కుదిరాయి. నేను ఈ పాత్ర చేసిందుకు గర్వంగా ఉంది. సాయికుమార్‌గారు అద్భుతంగా చేశారు. జీ5, బిబిసి కొలాబ్రేషన్‌లో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ... సీనియర్‌ నటి రాధిక గారితో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమెతో చేయాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ కుదరలేదు. ఈ ‘గాలివాన’తో ఆమెతో నటించాలనే కోరిక తీరింది. ఇప్పుడు ఓటీటీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. శరణ్‌ వంటి యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ టీంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు మంచి ఎమోషన్స్‌తో పాటు ఫుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ అండ్‌ థ్రిల్‌ను కలిగిస్తుంది. సినిమాలతో బిజీగా ఉన్న నేను ఇప్పటివరకు వెబ్‌ సిరీస్‌ కథలు చేయలేదు. అయితే దర్శకుడు శరణ్‌ చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మంచి ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ ‘గాలివాన’ ప్రేక్షకులనందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సిరీస్‌ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను

నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ... మా నార్త్‌ స్టార్‌ ప్రొడక్షన్‌కు ఈ ప్రాజెక్ట్‌ వెరీ స్పెషల్‌. జీ5, బిబిసిలతో కొలాబ్రేట్‌ అయ్యి చేస్తున్నాము. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాధిక గారు, సాయికుమార్‌ గారు ఈ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నందిని రాయ్‌, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్‌, ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు వర్క్‌ చేస్తున్నారు. దర్శకుడు శరణ్‌ కథకు ఏం కావాలో అది ఆర్టిస్టుల దగ్గర నుంచి రాబట్టుకున్నాడు. మంచి ప్లాన్డ్‌ టెక్నీషియన్‌. ప్రస్తుతం జరుగుతున్న ఈ చివరి షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా గాలివాన వెబ్‌ సిరీస్‌ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

జీ5 తెలుగు ఒరిజినల్‌ కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పద్మా కస్తూరి రంగన్‌ మాట్లాడుతూ... మా జీ5లో ప్రతినెలా ఒక హిట్‌ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాము. ఈ నెలలో వచ్చిన ‘లూజర్‌’ పెద్ద విజయం సాధించింది. ‘లూజర్‌2’ ఇటీవలే విడుదలైంది. దాని తర్వాత ‘ఏటీఎం’ను ఎనౌన్స్‌ చేయడం జరిగింది. ఓటీటీ ఇండస్ట్రీ సినిమాతో సమానంగా ఎదుగుతుందని శరత్‌మరార్‌ గారు 4 సంవత్సరాల క్రితమే గ్రహించి అప్పుడే వెబ్‌సిరీస్‌లను ఆయన స్టార్ట్‌ చేశారు. ఇప్పటి వరకు వెబ్‌సిరీస్‌లు చేయని రాధిక గారు, సాయి కుమార్‌ గారు ఈ ప్రాజెక్ట్‌లో వారు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నార్త్‌ స్టార్ట్‌, బీబీసీలతో కలసి చేస్తున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మంచి కంటెంట్‌తో వస్తున్న మా ‘గాలివాన’ సూపర్‌హిట్‌ అయి సీజన్‌ 2 కూడా చేయాలనేదే మా ఆశ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్‌లో రిలీజ్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నాము అన్నారు.

దర్శకుడు శరణ్‌ గోపిశెట్టి మాట్లాడుతూ... నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నాకు హోమ్‌ బ్యానర్‌ లాంటిది. ఇందులో ఇంతకు ముందు నార్త్‌స్టార్‌లోనే ‘ది గ్రిల్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేశాను. వేరే సినిమా చేద్దామని అనుకుంటున్న టైంలో శరత్‌ గారు ఫోన్‌ చేసి సీనియర్‌ నటి రాధిక గారు, సాయి కుమార్‌ గార్లతో వెబ్‌ సిరీస్‌ చేద్దామన్నారు. సీనియర్‌ యాక్టర్స్‌తో వెబ్‌ సిరీస్‌ చేసే అవకాశం రావడం చాలా ఆనందం కలిగింది. మిక్స్‌డ్‌ ఎమోషన్స్‌తో ఉండే క్రైం థ్రిల్లర్‌. ఇలాంటివి దర్శకుడికి నిజంగా ఛాలెంజ్‌ అని చెప్పాలి. రాధిక మేడమ్‌, సాయికుమార్‌ గార్లు మా యూనిట్‌కు ఫ్యామిలీ పెద్దలుగా ఉంటూ మా యూనిట్‌ని నడిపించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు శ్రీ చరణ్‌ పాకాల మ్యూజిక్‌ అందిస్తున్నారు. జీ5 పద్మ, అనురాధ, రాధ, కీర్తి, నీలిమ గార్లు మాకు ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. మంచి కథతో వస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ... శరత్‌ మరార్‌ గారు నాకు కాటమరాయుడు లో చేసే అవకాశం కల్పించారు. అదే బ్యానర్‌లో ఇప్పుడు ఈ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాధి గారు, సాయికుమార్‌ వంటి సీనియర్‌ నటులతో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి మంచి కంటెంట్‌ ఉన్న వెబ్‌ సిరీస్‌ లో చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు

నటి చాందిని మాట్లాడుతూ... శరత్‌ గారితో వర్క్‌ చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది.ఇప్పడు ఆ అవకాశం లభించింది.నాకు చిన్నప్పటి నుండి క్రైమ్‌, థ్రిల్లర్స్‌ అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టమైన సబ్జెక్ట్‌లో రాధిక మేడం, సాయికుమార్‌ గార్లతో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

నటుడు తాగుబోతు రమేష్‌ మాట్లాడుతూ... ఇప్పటి వరకూ నాకు తాగుబోతు ఇమేజ్‌ ఉన్న నన్ను సీనియర్‌ ఆర్టిస్ట్‌ లతో చేసే అవకాశం కల్పించారు. ఇంతమంది నటీనటులతో చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలు నా ధన్యవాదాలు అన్నారు.

నటి నందిని రాయ్‌ మాట్లాడుతూ.. జీ5లో నాకిది ఐదవ ప్రాజెక్ట్‌.రాధిక మేడం, సాయి కుమార్‌ల వంటి గొప్పనాటులతో చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. ఇంతకు ముందు నేను చేసిన ప్రాజెక్ట్స్‌ హిట్‌ అయినట్లే ఈ ప్రాజెక్టు కూడా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.