Yuvagalam Padayatra:ఈనెల 27న 'యువగళం' పాదయాత్ర పున:ప్రారంభం.. రూట్ మ్యాప్ ఖరారు..

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగడం లేదు. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు.

చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు విరామం ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభమై.. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలో ముగియనుంది. అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మరికొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని భారీ బహిరంగసభతో పాదయాత్రను ముగించేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసి కోస్తా ప్రాంతంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగింది. అయితే స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అనూహ్యంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో 208 రోజుల్లో 84 నియోజకర్గాల మీదుగా మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. ఇదిలా ఉండగా గతంలో పార్టీ అధినేత చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం పాదయాత్ర’ను విశాఖలోనే ముగించారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో లోకేశ్‌ కూడా విశాఖలోనే పాదయాత్ర ముగించాలని భావిస్తున్నారు.