YSRCP: మరోసారి వైసీపీదే అధికారం.. జగన్ ప్రభంజనం ఖాయమంటున్న సర్వే..

  • IndiaGlitz, [Friday,February 02 2024]

ఏపీలో ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉండంటతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైసీపీ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం అంటే.. టీడీపీ 'సంసిద్ధం'.. జనసేన 'మేమూ సిద్ధమే' అంటున్నాయి. మరోవైపు షర్మిల రాకతో విమర్శల వేడి మరింత పెరిగింది. దీంతో అధికారంలోకి వచ్చేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే 'ఎలెక్ సెన్స్' అనే ప్రముఖ సర్వే సంస్ధ ప్రీ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

ఈ సర్వే ప్రకారం వైసీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని తేలింది. సర్వే ఫలితాలను విశ్లేషిస్తే.. వైసీపీ 122(+/- 10) స్థానాల్లో.. 49.14 శాతం ఓట్లను సాధిస్తుంది. టీడీపీ-జనసేన కూటమికి 53 (+/-10) స్థానాలతో 44.34 ఓటింగ్ శాతం వస్తుందని వెల్లడైంది. ఇక బీజేపీకి 0.56 శాతం, కాంగ్రెస్‌కి 1.21 శాతం, ఇతరులకు 4.75 శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే తెలిపింది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కనీసం ఖాతాను కూడా తెరవలేవని అంచనా వేసింది.

2023 డిసెంబర్ 1 నుంచి 2024 జనవరి 1 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 88,7000 శాంపిల్ తీసుకున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడాన్నే పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్ పరిపాలనపై 53.7శాతం మంది సంతృప్తిని వ్యక్తంపరిచినట్లు చెప్పింది. 6.3 శాతం మంది ఫర్వాలేదని పేర్కొంది. గన్ పాలనను మెచ్చుకున్న వారిలో మగవారి కంటే మహిళలే అధికంగా ఉన్నట్లు తేల్చింది.

జిల్లాల వారీగా సీట్లను పరిశీలిస్తే..

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 7 స్థానాలు, టీడీపీ-జనసేన కూటమి 2 స్థానాలు, ఒక్క స్థానంలో గట్టి పోటీ జరుగుతుంది.
విజయనగరం జిల్లాలో వైసీపీకి 8 స్థానాలు దక్కగా, ఒక్క స్థానంలో గట్టి పోటీ ఉంటుంది.
విశాఖపట్నంలో వైసీపీ 4, టీడీపీ-జనసేన కూటమి 10 స్థానాలను దక్కించుకోనున్నాయి. ఒక్క స్థానంలో గట్టి పోటీ ఉండనుంది.
తూర్పు గోదావిరి జిల్లాలో వైసీపీకి 7 స్థానాలు, టీడీపీ-జనసేనకి 9 స్థానాలు, 3 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి 8 స్థానాలు, టీడీపీ-జనసేనకి 3 స్థానాలు, 4 స్థానాల్లో పోటీ గట్టిగా ఉంటుంది.
కృష్ణా జిల్లాలో వైసీపీ 9 స్థానాలు, టీడీపీ- జనసేనకు 5 స్థానాలు, స్థానాల్లో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది.
గుంటూరు జిల్లాలో వైసీపీ 11 స్థానాలు, టీడీపీ-జనసేనకు 3 స్థానాలు, మరో 3 చోట్ల టఫ్ ఫైట్ జరగనుంది.
ప్రకాశం జిల్లాలో వైసీపీకి 8, టీడీపీ-జనసేన కూటమికి 2, మరో 2 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది.
నెల్లూరు జిల్లాలో వైసీపీ 9, టీడీపీ-జనసేన ఒక్క స్థానం గెలుచుకోనున్నాయి.
చిత్తూరు జిల్లాలో వైసీపీ 12 స్థానాలు, టీడీపీ- జనసేనకి 2 స్థానాలు గెల్చుకుంటాయి.
కడప జిల్లాలోని మొత్తం 10 స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి.
కర్నూలు జిల్లాలో వైసీపీ 12, టీడీపీ, జనసేన కూటమి 2 స్థానాలు గెల్చుకోనున్నాయి.
అనంతపురం జిల్లాలో వైసీపీకి 8 స్థానాలు, 2 స్థానాలు టీడీపీకి దక్కగా, మరో 4 స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది.

మొత్తంగా ఎలెక్ సెన్స్ పోల్స్ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి వైసీపీదే అధికారంమని తేలింది. దీంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సర్వే రిపోర్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఈ సర్వే ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.