YS Sharmila:లోకేష్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్.. జోరుగా చర్చలు మొదలు..

  • IndiaGlitz, [Monday,December 25 2023]

టీడీపీ యువనేత నారా లోకేష్‌(Nara Lokesh) ఊహించని క్రిస్మస్ గిఫ్ట్(Christmas gift) అందుకున్నారు. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్రిస్మస్ గిఫ్ట్‌లు అందుకోవడంలో పెద్ద చర్చ ఉండదు. కానీ అదే గిఫ్ట్ రాజకీయ ప్రత్యర్థుల కుటుంబ నుంచి వస్తే మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు లోకేష్‌కు వచ్చిన కానుక కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ఆ క్రిస్మస్ కానుకను పంపింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). క్రిస్మస్ పండుగ సందర్భంగా లోకేష్‌కు షర్మిల కానుకలు పంపించారు.

వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ కూడా అందించారు. దీనిపై లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు. తనకు క్రిస్మస్ కానుక పంపిన షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. నారా కుటుంబం తరఫున షర్మిలకు, ఆమె కుటుంబసభ్యులకు క్రిస్మస్‌తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో సీఎం జగన్‌(CM Jagan)పై లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో సాక్షాత్తూ జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల లోకేష్‌కు గిఫ్ట్ పంపడం.. అందుకు ఆయన థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది.

అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్, షర్మిల మధ్య వ్యక్తిగత విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ముందుకు సాగుతున్నారు. ఇటు కూతురకి తోడుగా వైయస్ విజయమ్మ కూడా జగన్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐకి షర్మిలకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో రాజకీయంగా జగన్‌ పార్టీపై విమర్శలు కూడా చేశారు. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంత అన్న జగన్.. శత్రువులుగా భావించే లోకేష్‌ కుటుంబానికి షర్మిల ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.