జగన్ షాకింగ్ నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ నేతలు!

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాటినుంచి ఇప్పటి వరకూ పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులు, కీలక నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కంగుతిన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కుటుంబ స‌భ్యులు, సమీప బంధువుల‌ను పోటీలో దించొద్దని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఇప్పటికే నామినేషన్ వేసినవారికి బి-ఫారం ఇవ్వద్దని పార్టీ జోన‌ల్ ఇంఛార్జ్‌ల‌కు, రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్లకు, పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ స్థానిక సంస్థల ఎన్నిక‌ల ఇంచార్జ్‌లకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వైసీపీ నేతలకు ఊహించని షాకే.