YS Jagan: సత్ఫలితాలను ఇస్తున్న జగనన్న విద్యా సంస్కరణలు.. ఇది బాధ్యతాయుతమైన పాలన అంటే..

  • IndiaGlitz, [Tuesday,October 10 2023]

గ్రామంలోని స్కూలుకు వెళ్లి చదువుకోడం, ఇంటికి వెళ్లడం ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల పరిస్థితి. కనీసం పట్టణం వెళ్లడమే ఎంతో కష్టం అనుకునే పేద పిల్లలు ఇప్పుడు సప్త సముద్రాలు దాటి ఎక్కడో ఉండే అమెరికాకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని ఆయాదేశాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు. అక్కడి పాలనావిధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాల మీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాలమీద విద్యావేత్తలు, ఆర్థిక, సామజికవేత్తలతో భేటీలు నిర్వహించారు.

అమెరికాలో ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమతి కార్యాలయం సందర్శన..

ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదిమంది విద్యార్థులు పదిహేను రోజులపాటు కొలంబియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు. ఇదే తరుణంలో ఆంధ్రపదేశ్ విద్యారంగంలో చోటుచేసుకున్న గణనీయమైన మార్పులను, అందుకోసం సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి నాడు- నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందో వెల్లడించారు. అమెరికా వెళ్లిన పిల్లలందరూ ప్రభుత్వ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పేద కుటుంబాల్లోని వారే. పట్టణంలోని కాన్వెంట్లను చూసి అబ్బురపడే పిల్లలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలమీద ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

ఈ స్థాయికి మీరే కారణం జగన్ మావయ్య..

ఈ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని దేశవిదేశాలకు చెందిన విద్యావేత్తల ప్రశంసలు అందుకున్న విద్యార్థులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సీఎంతో మాట్లాడుతూ తాము సాంఘికశాస్త్రం పుస్తకాల్లో మాత్రమే చూసిన ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయాలను నేరుగా సందర్శిస్తామని కలలో కూడా ఊహించలేదని ఇందుకు మీరే కారణమని, తమను ఈ స్థాయికి తీసుకెళ్లింది కూడా మీరే అని కృతజ్ఞతలు తెలిపారు.

మీరు చదువుకోండి.. బాధ్యత నేను తీసుకుంటా..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వారితో మాట్లాడుతూ పిల్లలను గొప్పగా చదివించేందుకు ప్రభుత్వం ఎంతగా తాపత్రయపడుతున్నాదో వివరించారు. ప్రతిష్టాత్మక విదేశీ వర్సిటీల్లో సీటు తెచ్చుకుంటే ఫీజుల భారం రూ.కోటిన్నర వరకూ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. జీఆర్ఈ, జీ మ్యాట్ వంటి పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని వివరిస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని వారిని ప్రోత్సహించారు. పాఠ్య ప్రణాళికలో లేని దాదాపు 1800 సబ్జెక్టులను సైతం సిలబస్‌లో చేరుస్తున్నట్లు వివరించారు.

ముందుచూపు అంటే ఇది.. విజన్ అంటే ఇది..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడాన్ని తెలుగుదేశం, దాని అనుకూల మీడియా, చివరికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సైతం విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వద్దంటే వద్దని అడ్డుపడ్డారు. కానీ విజనరీ అయిన ముఖ్యమంత్రి జగన్ ముందుచూపు, దూరదృష్టి, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ ఇంగ్లీష్ మీడియం విద్య ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తోంది. లక్షలు పోసి కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న సెలబ్రిటీల పిల్లలు ఎవరూ ఇలా అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వెళ్లలేదు. కానీ ప్రభుత్వం చేపట్టిన విద్యాసంస్కరణల ఫలితంగా పేదింటి పిల్లలు విదేశాల్లో సైతం నిర్భయంగా నిపుణుల ముందు రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. పాలకుడు అంటే ఆ పూటకు ఏదో సాయం చేయడం కాదు.. ముందు తరాలకు సైతం ఉపయోగపడేలా భవిష్యత్తుకు బాటలు వేయాలి. ఇప్పుడు జగనన్న చేస్తుంది అదే. ఈ విద్యాసంస్కరణలు రానున్న తరాలకు గొప్ప ప్రయోజనం చేకూరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.