అంగన్‌వాడీలకు అండగా జగన్‌ ప్రభుత్వం.. టీడీపీ ప్రోద్భలంతోనే సమ్మె..

  • IndiaGlitz, [Monday,January 22 2024]

గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అంగన్‌వాడీలకు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో వారి కష్టాలను చూసి చలించిపోయారు. అందుకే అధికారంలోకి రాగానే వారికి ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చారు. దీంతో పాటు సిబ్బంది కోరిన పలు న్యాయపరమైన కోర్కెలను కూడా మన్నించి నెరవేర్చే దిశగా సాగుతోంది. అంతేకానీ ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ఏనాడూ వారి పట్ల ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించలేదు. గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లల బాధ్యతలను గాలికి వదిలేసినా గట్టిగా హెచ్చరించలేదు.

చంద్రబాబు ఉచ్చులోకి సిబ్బంది..

వారి ఆందోళనను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. ప్రభుత్వం ఇంత సానుకూలంగా ఉన్నా కూడా కొంతమంది అంగన్‌వాడీ ఉద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకున్నారు. వారు ఎలా చెబితే అలా చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాక తోటి సిబ్బందిని సైతం ఆ ఉచ్చులోకి లాగుతున్నారు. తన హయాంలో ఆందోళనలు చేస్తున్న అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి మద్దతుగా మాట్లాడుతుండటం విడ్డూరం. ఇలా మాట్లాడటం వెనక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటో సిబ్బంది తెలుసుకోవాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఆచరణకు అలవికాని కోరికలు, డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు.

అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలు..

వాస్తవానికి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అంగన్వాడీ వర్కర్లకు రూ. 11,500 , ఆయాలకు రూ. 7,000 వేతనం అందిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇస్తున్న వేతనాల కన్నా ఎక్కువే అని చెప్పాలి. ప్రభుత్వం ఇంత సాయం చేస్తున్నా కూడా కొంతమంది సిబ్బంది రాజకీయ నాయకుల ఉచ్చులో పడి వారు చెప్పినట్లు ఆడుతూ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. అయినా కానీ వారి డిమాండ్ల విషయంలో సాధ్యమైనంత వరకు సానుకూలంగా స్పందిస్తూ వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. జూన్‌లో జీతాల పెంపునకు హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాల మాయలో నడుస్తూ ఉద్యమం చేస్తున్నారు. అందుకే అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. వీరి ఉచ్చులో చిక్కుకున్న మిగిలిన సిబ్బందిని కాపాడాలంటే కొంతమందిపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.