Woman Constable:సార్.. ఫోన్‌తో లోపలికి పోవద్దు : ఏకంగా సీపీని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్ , వీడియో వైరల్

  • IndiaGlitz, [Friday,April 07 2023]

గురువారం ఉదయం రాచకొండ పోలీస్ కమీషనర్ చౌహాన్ ఎల్బీ నగర్‌ పరిధిలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి సీపీ వచ్చారు. గేటు బయటే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం లోనికి వెళ్తుండగా.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఏకంగా సీపీ చౌహాన్‌ను అడ్డుకున్నారు. సెల్‌ఫోన్‌తో లోపలికి అనుమతించేది లేదని ఇక్కడే ఇచ్చి వెళ్లాలని చెప్పింది. ఆ మాటలతో అక్కడే వున్న పోలీసు అధికారులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. కానీ సీపీ మాత్రం నవ్వుతూ తన సెల్‌ఫోన్‌ను ఆమెకు ఇచ్చి లోపలికి వెళ్లారు. ఆయన వెంటే మిగిలిన పోలీసులు సైతం తమ మొబైల్‌ను బయటే వదిలి వెళ్లారు.

కాసేపటికి బయటికి వచ్చిన సీపీ చౌహాన్.. ఏం మాట్లాడతారోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మహిళా కానిస్టేబుల్ నుంచి ఫోన్ తీసుకుని ఆమెను అభినందించారు. అంతేకాకుండా ఆమెకు అక్కడికక్కడే రివార్డ్ ప్రకటించారు. ఎంతటి హోదాలో వున్న వ్యక్తినైనా పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌తో అనుమతించవద్దని చౌహాన్ తెలిపారు. ప్రతి విద్యార్ధిని చెక్ చేయాలని ఆదేశాలు చేశామని.. తాను సెంటర్‌లోకి వెళ్లేముందు మహిళా కానిస్టేబుల్ తన సెల్‌ఫోన్ తీసుకున్నారని చెప్పారు. ఆమె చేసిన పనికి తాను ప్రశంసిస్తున్నాని చౌహాన్ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.. తెలంగాణలో పదో తరగతి పేపర్ లీక్ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిబ్బంది, ఇన్విజిలేటర్లు, విద్యార్ధులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక పరీక్షా కేంద్రం లోపలికి ఎవరికైనా సరే సెల్‌ఫోన్ నో ఎంట్రీ. ఈ నిబంధనను అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని 2,652 పరీక్షా కేంద్రాల్లో పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందిని సిట్టింగ్ స్క్వాడ్స్‌గా నియమించింది.