Keshineni Nani:టీడీపీకి రాజీనామా చేస్తా.. మరో బాంబ్ పేల్చిన కేశినేని నాని..

  • IndiaGlitz, [Saturday,January 06 2024]

విజయవాడం ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) మరో బాంబ్ పేల్చారు. త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. దీంతో కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి.

‘అందరికి నమస్కారం.. చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీకి వెళ్లి లోకసభ స్పీకర్‌ను కలిసి నా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింపజేసుకుని, ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను’ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

కాగా వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీ టికెట్ వేరే అభ్యర్థికి అధిష్టానం కేటాయించినట్లు నాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అందరికీ నమస్కారం.. నిన్న సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ నన్ను కలసి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్‌చార్జ్ గా చంద్రబాబు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు నాకు చెప్పమన్నారని తెలియచేశారు. అలాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని నాకు తెలియచేశారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను అని వెల్లడించారు.

దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరతారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. మరి వైసీపీలో చేరతారో.. లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.