షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన విశాల్.. ఆసుపత్రికి తరలింపు

  • IndiaGlitz, [Saturday,February 12 2022]

మనకి రెండు గంటల పాటు వినోదం అందించేందుకు హీరోలు, హీరోయిన్లు ఎంతో కష్టపడతారు. ఈ క్రమంలో ప్రాణాలు పొగొట్టుకున్న వారు కూడా వున్నారు. ఇక కాళ్లు, చేతులు విరిగి మంచానికే పరిమితమైన వారు ఎందరో. అందుకే షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ పలువురు హీరోలు ప్రమాదాల బారినపడుతూనే వున్నారు. తాజాగా తమిళ హీరో విశాల్ ప్రమాదానికి గురయ్యారు.

ప్రస్తుతం లాఠీ అనే సినిమాలో నటిస్తున్నాడు విశాల్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో చిత్రీకరణ చేస్తుండగా గాయపడ్డాడు విశాల్. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

ప్రస్తుతానికి ఆయన కేరళలో చికిత్స పొందుతున్నారు. లాఠీ సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దుండగుల బారి నుంచి ఓ బాబును కాపాడే సన్నివేశంలో విశాల్.. గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విశాల్ చేయి, నుదురు భాగంలో గాయమైంది. వినోద్ కుమార్ లాఠీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో విశాల్ హీరోగా నటించిన వేటాడు వెంటాడు సినిమాలో కూడా నటించింది సునయన. మరోసారి ఇప్పుడు ఆయనతో జోడీ కట్టింది. ప్రస్తుతం విశాల్‌కు గాయం కావడంతో షూటింగ్‌కు విరామం ఇచ్చింది చిత్రయూనిట్. తిరిగి మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఇటీవల సామాన్యుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశాల్. ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.