Vijayawada:విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి..

  • IndiaGlitz, [Monday,November 06 2023]

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ-గుంటూరు వెళ్లే బస్సు అకస్మాత్తుగా ఫ్లాట్‌ఫాం మీదకి దూసుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్న కండెక్టర్‌తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు, 10 నెలల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో 11, 12 ప్లాట్‌ఫాంలపై ఉన్న ఫర్నిచర్‌ ధ్వంసమైంది. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతిచెందిన కండక్టర్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఈ ఘటనతో బస్టాండ్‌లోని ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని.. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తెలుసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని.. గాయపడిన వారికి ఆసుపత్రి ఖర్చులు భరిస్తామన్నారు. బస్టాండులోనే ప్రమాదం జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. డ్రైవర్ ఇటీవల అనారోగ్యంతో ‌కోలుకుని విధులకు వచ్చారన్నారు. ఆల్కహాల్ టెస్ట్ చేశాకే డ్రైవర్‌కు బస్సు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

విజయవాడ బస్సు ప్రమాదంపై టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదానికి వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని... వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని విమర్శించారు. ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదని మండిపడ్డారు. రిక్రూట్‌మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని లోకేష్ తెలిపారు.