విజ‌య్‌, స‌మంత.. ఒకే త‌ర‌హా పాత్ర‌ల్లో..

  • IndiaGlitz, [Tuesday,December 19 2017]

మ‌హాన‌టి సావిత్రి జీవితంలోని ముఖ్య కోణాల్ని స్పృశిస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హాన‌టి. న‌డిగ‌ర్ తిల‌గ‌మ్ పేరుతో త‌మిళంలోనూ ఈ సినిమా తెర‌కెక్కుతోంది. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నుంది. కీల‌క పాత్ర‌ల్లో మోహ‌న్‌బాబు, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సమంత‌, షాలినీ పాండే న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఎస్వీఆర్‌గా మోహ‌న్‌బాబు, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్‌, జ‌మున‌గా షాలిని న‌టిస్తున్నారు. విజ‌య్‌, స‌మంత పాత్ర‌ల‌పై పెద్ద క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో.. విజ‌య్ అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టేశాడు.

ఇందులో తను ఎన్టీఆర్ పాత్ర‌లోనో ఎంజీఆర్ పాత్ర‌లోనో న‌టిస్తున్నానంటూ వ‌స్తున్న వార్త‌లు నిజం కావ‌ని.. ఇందులో తాను, స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నామ‌ని చెప్పుకొచ్చాడు విజ‌య్‌. దీంతో.. విజ‌య్‌, స‌మంత పాత్ర‌ల తాలుకూ గాసిప్పుల‌కు తెర‌ప‌డిన‌ట్ల‌య్యింది. మ‌హాన‌టి మార్చి 29న తెర‌పైకి రానుంది.