వెంకటేష్ - నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్లో మూవీ డీటైల్స్..

  • IndiaGlitz, [Friday,August 05 2016]

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ..హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌. ఈ అగ్ర కథానాయకుడు నటించనున్న నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న యువ దర్శకుడు కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అక్టోబర్‌లో ప్రారంభంకానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, దర్శకుడు కిషోర్‌ తిరుమల తెలియచేస్తూ...అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు వెంకటేష్‌ నటించిన ఆడవారిమాటలకు అర్థాలే వేరులే, మల్లీశ్వరి, నువ్వునాకునచ్చావ్‌ తరహాలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. వెంకటేష్‌గారి నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌గారి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభిస్తాం. త్వరలోనే వెంకటేష్‌గారి సరసన నటించే కథానాయిక తో పాటు చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం అని తెలిపారు.