Uttarakhand:ఉత్తరాఖండ్ సొరంగం ఆపరేషన్ సక్సెస్.. దేశమంతా ఆనందోత్సవాలు..

  • IndiaGlitz, [Wednesday,November 29 2023]

యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఆ క్షణానికి తెరపడింది. 17రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లు విజయవంతంగా ముగిశాయి. ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రత్యేక ఆధునిక పరికరాలతో 58 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేశారు. దేశీయులతో పాటు విదేశీలు కూడా చేసిన కృషికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. దీంతో బాధిత కుటుంబసభ్యలతో పాటు దేశ ప్రజలందరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. మొదట ఇద్దరు, తర్వాత మరో నలుగురుతో కాసేపటికే మొత్తం 41 మంది కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇలా చిక్కుకున్న అందరిని బయటికి తీసుకురావడానికి గంటకు పైగా సమయం పట్టింది.

సొరంగం నుంచి బయటకు వచ్చిన వెంటనే కార్మికులందరినీ అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కూలీలను టన్నెల్‌ నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అక్కడే ఉండి ఒక్కో కూలీని ఆప్యాయంగా పలకరించారు. 17రోజుల పాటు సొరంగంలోనే మానసికంగా..శారీరకంగా ఎంతో నరకయాతనను అనుభవించి మృత్యుంజయులుగా బయటకు వచ్చిన వారి కుటుంబసభ్యుల ఆనందం మాటల్లో వర్ణించలేనింది. నవంబర్ 12న సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో అందులో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

కార్మికులను కాపాడేందుకు తలపెట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ఇది కృతజ్ఞత తెలపాల్సిన సమయం. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మందిని కాపాడేందుకు 17 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం ఇవ్వలేని ఆనందాన్ని మీరు దేశప్రజలకు అందించారు. ఆశలు సాకారం చేశారు. అందరం కలిసికట్టుగా శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని, బయటపడలేనంత లోతైన సొరంగం ఏదీ ఉండదని మీరు నిరూపించారు అని ట్వీట్ చేశారు.