కౌంటింగ్ ఆపేయండి.. సుప్రీంకోర్టుకు వెళతా: ట్రంప్

అమెరికా ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గెలుపు లాంఛనమేనని ప్రకటించిన ట్రంప్.. సడెన్‌గా ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాను సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఈ ఎన్నికల్లో తామే గెలవబోతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. చట్టం తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఆపేయాలని ట్రంప్ కోరారు. మరోవైపు భారీ విజయోత్సవానికి సిద్ధంగా ఉండాలంటూ అభిమానులకు ట్రంప్ పిలుపునిచ్చారు.

అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు లాంఛనమేనన్నారు. అత్యద్భుతంగా మద్దతు తెలిపినందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ విజయోత్సవానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. 'జార్జియా, నార్త్‌ కరోలైనా రాష్ట్రాల్లో గెలవనున్నామని ట్రంప్ వెల్లడించారు. కీలకమైన పెన్సిల్వేనియాలోనూ భారీ ఆధిక్యంలో ఉన్నామన్నారు. ప్రజలు భారీగా తరలివచ్చి తమ పార్టీకి మద్దతు తెలిపారని డొనాల్డ్ ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా.. ఇప్పటివరకు బైడెన్‌కు 238 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ట్రంప్‌కు 213 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇంకా ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. 270 ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన వారినే అమెరికా అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.