Amit Shah:బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చే టైం ఆసన్నమైంది: అమిత్ షా

  • IndiaGlitz, [Saturday,November 18 2023]

దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ, మద్యం కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణాలు బయటపడ్డాయని ఆరోపించారు. త్వరలోనే వాటిపై విచారణ చేయిస్తామని తెలిపారు.

అబద్ధపు హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. తెలంగాణలోని బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని.. ఎన్నికలక్లో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అలాగే ప్రధాని మోదీ మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు చోటు కల్పించామని.. బీసీ వ్యక్తిని ఏకంగా దేశ ప్రధానిగా చేసిన ఘనత బీజేపీది అని షా పేర్కొన్నారు. ఇక నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీలకు కేటాయిస్తామని స్పష్టంచేశారు.

కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ 2జీ, 3జీ, 4జీ పార్టీలు అని సెటైర్లు వేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏడు నోటిఫికేషన్లు విడుదల చేశారని.. కానీ పేపర్లు లీక్ చేసి వాటిని ఆపేశారని ఆరోపణలు చేశారు. దీంతో ప్రవళిక, అబ్రహం లాంటి యువత బలైపోతుందని ఫైర్ అయ్యారు. బీజేపీని గెలిపిస్తే ఐదేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చే టైం ఆసన్నమైందని అమిత్‌ షా వెల్లడించారు.