ఆ కన్నీళ్లు, ఆ కష్టాలే జనసేన పార్టీ పెట్టేలా చేశాయ్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ నేల రాజకీయం ప్రసాదించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహుజనసేన యుద్దభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. "చైతన్యం కోసం పోరాటం ఎలా చేయాలో తెలంగాణ నాకు నేర్పించింది. నా ఆత్మ ఇక్కడ ఉంది. ఆంధ్ర, తెలంగాణ అంటూ రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు నేను ఏ రాష్ట్రానికి చెందినవాడినో అర్థం కాలేదు. తెలంగాణలో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరిగితే కన్నీరు పెట్టుకున్నాను. ఆ కన్నీళ్లే, ఆ కష్టాలే జనసేన పార్టీ పెట్టి ఇవాళ మీ ముందు ఇలా నిలబెట్టాయి. 2014 ఎన్నికల ప్రచారంకు వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్ధి మోడీ గారిని మనస్ఫూర్తిగా నమ్మాను. ఆయన బలమైన నాయకుడు అని చెప్పాను. తర్వాత తెలిసింది ఆయన బలమైన నాయకుడు కాదు అందరిలాంటి రాజకీయ నాయకుడేనని. ఆయన దేశానికి పనికొచ్చే నాయకుడులా అనిపించలేదు. ఆయన్ను మనం ఇష్టపడి ఎన్నుకుంటే.. ఆయన భయపెట్టి పాలిస్తున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, ప్రత్యర్ధులపై కేసులు వేయండి, దేశభక్తి అంటే సినిమాల్లో చూపించాలనడం ఇవన్ని దృష్టిలో పెట్టుకుని నెమ్మది నెమ్మదిగా ఆయన నుంచి పక్కకు జరిగాను. ఒక ఛాయివాల ప్రధానమంత్రి అయినప్పుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మన భారత దేశానికి మాయావతిగారిని ఎందుకు ప్రధాన మంత్రిగా చూడలేము. సొంత ఎమ్మెల్యేలే తప్పు చేస్తే శిక్షించింది ఆమె. అలాంటి వ్యక్తులు ప్రధాన మంత్రి అయితే దేశం ముందుకు వెలుతుంది. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని ఎలాగు చేయలేకపోయాం. దేశానికి ప్రధానమంత్రిగా మాయావతి గారిని చేసుకుందాం" అని పవన్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ యువత కోరుకున్నది కుటుంబ పాలన కాదు ..
మాయావతి గారి కష్టం ఎప్పుడు తెలుసుకున్నానంటే.. ఆమె నెహ్రుగారి కూతురు ఇందిరాగాంధీ కాదు, కేసీఆర్ గారి కూతురు కవిత గారు కాదు. ఉన్నత కులాల నుంచి వచ్చిన ఆడబిడ్డ కాదు. బస్తీల్లో పెరిగిన పోస్టల్ క్లర్క్ కూతురు. హార్వర్డులో చదువుకోలేదు కానీ జీవితాన్ని క్షుణంగా చదివిన వ్యక్తి. ఎన్ని డిగ్రీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది. యూపీలోని బందిపోట్లు, రాజాలు, వీళ్లందరి మధ్యలో సంప్రదాయ రాజకీయ కుటుంబాల మధ్యలో కాన్షీరాం గారి అడుగు జాడల్లో నడుస్తూ .. ఆయన అస్తమించాక ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో సమూలమైన మార్పు తీసుకొచ్చారు. ఆమె పడిన కష్టానికి దక్షణాది ప్రజల తరుపున పాదాభివందనం చేస్తున్నాను. 2008లో కొంతమంది దళిత మేధావులు ఆమెను కలవాలని సూచించారు. అయితే అప్పటి పరిస్థితులు బట్టి కుదరలేదు. 11 ఏళ్ల తర్వాత ఆ కల నెరవేరింది.
గెలిపించండి..
"కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీఎస్పీ తరపున వెంకన్, పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి బీఎస్పీ తరపున బాల కల్యాణ్, వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఎస్పీ తరపున డి. శారద, నాగర్ కర్నూలు లోక్ సభ స్థానం నుంచి బీఎస్పీ తరపున యూసఫ్, చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి బీఎస్పీ తరపున విజయ్ ఆర్య, ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి జనసేన తరపున నరేంద్ర నాయక్, ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున సత్యనారాయణ, మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున భాస్కర్ నాయక్ , నల్గొండ లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున సతీష్ రెడ్డి, నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున శంకర్ , జన సైనికుడుగా ఉండి జనసేన నాయకుడిగా ఎదిగిన శంకర్ గౌడ్ను సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి, 2008 నుంచి నాకు వెన్నంటే ఉన్న మహేందర్ రెడ్డిని మల్కాజ్ గిరి లోక్సభ స్థానం నుంచి బరిలో నిలబెడుతున్నాం. జనసేన కూటమికి ఓట్లు వేసి తమ అభ్యర్ధులను అఖండ మెజార్టీతో గెలిపించాలి" అని పవన్ రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు.
రెండు రాష్ట్రాల మధ్య హింస వద్దు
ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలుపెట్టవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు పవన్ విజ్ఞప్తి చేశారు. “ఏపీ ఎన్నికల విషయంలో కేసీఆర్ తటస్థంగా ఉండాలి. తెలంగాణను వ్యతిరేకించిన జగన్కు కేసీఆర్ మద్దతివ్వడం సరికాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్న విషయం కేసీఆర్ మరిచిపోయారా? చంద్రబాబుకు ఎలాంటి రిటర్న్ గిఫ్టులు ఇస్తారో ఇచ్చుకోండి. కానీ రెండు రాష్ట్రాల మధ్య హింసను సృష్టించవద్దు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగితే తెలంగాణ ఉద్యమ స్పూర్తితో బయటకు వస్తా. జగన్ తిరుమలకు చెప్పులతో వెళ్లారు. జగన్ యాదాద్రికి చెప్పులతో వస్తే కేసీఆర్ ఒప్పుకుంటారా? ప్రేమాభిమానంతో మోదీని ప్రధానిని చేస్తే ఆయన భయపెట్టి పరిపాలన చేయాలనుకుంటున్నారు. మోదీని దేశ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు" అని జనసేనాని చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments