Ayodhya Balaram:అయోధ్య బాలరాముడి రూపం ఇదే.. తన్మయంతో మురిసిపోతున్న భక్తులు..

  • IndiaGlitz, [Friday,January 19 2024]

యావత్ దేశంతో పాటు విదేశాల్లోని హిందూవులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుతమైన క్షణంకు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ట జరగనుంది. దీంతో బాలరాముడి విగ్రహం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి ఆ బాల రాములోరి విగ్రహంకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే వాటిలో రాముడి ముఖం వస్త్రంతో కప్పి ఉంది. తాజాగా విడుదలై ఫొటోల్లో పూర్తి విగ్రహం బయటకు వచ్చింది. ఆ విగ్రహం చూసిన వారు తన్మయంలో మునిగిపోతున్నారు.

ఆలయ నిర్వాహకులు ప్రాణ ప్రతిష్ఠకు ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఆ బాలరాముడిని చూస్తుంటే సాక్షాత్తూ చిన్నప్పటి రాములోరే స్వయంగా వచ్చినట్లు ఉంది. అంత అందంగా విగ్రహాన్ని చెక్కారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆ దేవుడినే చూసినంతా సంబరిపడిపోతున్నారు. ఈ విగ్రహాన్ని కృష్ణ శిలతో కర్ణాటకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 5 అడుగుల పొడవైన బాల రాముడి విగ్రహం బరువు 150 కేజీలు ఉంది. నల్లని పద్మపీఠంపై ఐదేళ్ల బాలుడి రూపంలో ఆ రామయ్య కొలువుదీరారు. ముఖంపై చిరుదరహాసంతో నుదిటన మూడు నామాలతో సుందర రూపంలో వెలిగిపోతున్నారు. బంగారు విల్లు, బాణం చేత పట్టుకుని రోమాలు నిక్కబొడిచే ఠీవితో నిల్చుని ఉన్నారు.

ఇక జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 12.20 - 1.00 గంటల మధ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. కాశీకి చెందిన ప్రముఖ జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో రామాలయ ప్రతిష్టాపన పూజలు జరగనున్నాయి. అంతేకాకుండా శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్యకిరణాలు పడేలా అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి ఆలయం నిర్మించారు.

మరోవైపు రామమందిరం నిర్మాణంతో అయోధ్య నగర రూపురేఖలు మారిపోయాయి. రైల్వేస్టేషన్ పునర్‌నిర్మాణం, విమానాశ్రయం ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా అడుగడుగునా అయోధ్యలో మార్పు కనపడుతోంది. రామమందిరం ప్రారంభమైన దగ్గర నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరానున్నారు. అందుకు తగ్గట్లు పర్యాటకులకు ఎలాంటి అసాకర్యకం కలగకుండా అయోధ్యను తీర్చిదిద్దుతున్నారు. నగరంలో ఏ మూల చూసినా త్రేతాయుగం ఆనవాళ్లు కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. అయోధ్య పునర్‌నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రూ.85వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి.

అంతేకాకుండా విశాలమైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సువిశాల సరయూ తీరం, నది ఒడ్డున ఘాట్‌లు, అండర్‌ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, భవనాల పునర్‌నిర్మాణం చేపడుతూ అయోధ్య నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. విద్యుత్ వైర్లు గాలిలో ఎక్కడా కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌లో నిర్మిస్తున్నారు. సరయూ నదీ తీరంలో గుప్తార్ ఘాట్ నుంచి నిర్మాలీ కుండ్ వరకు 10.2 కిలోమీటర్ల మేర 470 సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అయోధ్యను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తంగా అయోధ్య ఆధ్యాత్మికంతో పాటు పర్యాటక ప్రాంతంగా కొత్తరూపు తెచ్చుకుంటోంది.