Pawan Kalyan:పవన్ కల్యాణ్‌ పోటీ చేసే నియోజకవర్గం ఇదే..

  • IndiaGlitz, [Wednesday,February 21 2024]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భీమవరం పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. భీమవరం పర్యటనకు వచ్చిన సేనానికి అభిమానులు, టీడీపీ-జనసేన కార్యర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా మాజీ రాజ్యసభ ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. తన గెలుపునకు టీడీపీ నేతలు సహకరించాలని కోరారు.

ఈ భేటీలో టీడీపీ నేతలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు ఇంటికి వెళ్లారు. భీమవరం నుంచి టీడీపీ తరపున సీటు ఆశిస్తున్న రామాంజనేయులును కలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత పాక సత్యనారాయణతో భేటీ అయ్యారు. తాజాగా రాజకీయాలపై వారితో చర్చించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్‌ అని.. మనుషులను విడగొట్టే ఆయన విషసంస్కృతి కుటుంబాల్లోకి కూడా వెళ్లిపోయిందని.. వివిధ కులాలు కొట్టుకు చావాలనేదే జగన్‌ నైజం అని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేశాడని.. అలాంటి వాడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఘనస్వాగతం పలికారని విమర్శించారు. సమాజానికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగివస్తుందని.. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని తెలిపారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకు? అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని... మీరు సిద్ధం అంటే.. మేం యుద్ధం అంటామని హెచ్చరించారు.

అయితే భీమవరం పర్యటనలో ఉండగానే పవన్ కల్యాణ్‌కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన తన పర్యటనను త్వరగా ముగించుకుని హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి లేదా రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

కాగా గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్‌కు 62,285 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులుకు 54,037 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ది గ్రంథి శ్రీనివాస్‌కు 70,642 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 8,357 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి టీడీపీతో పొత్తు ఉండటంతో భీమవరం నుంచి పోటీ చేస్తే పవన్ గెలుపు సులభం అని పార్టీ నేతలు అంచనా వేశారు. దీంతో ఓడిన చోట నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ డిసైడ్ అయ్యారట. అలాగే రెండో నియోజవర్గంగా రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

More News

Vemireddy Prabhakar Reddy: అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా..

ఎన్నికల సమయంలో అధికార వైపీపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Nara Bhuvaneshwari:చంద్రబాబు గారికి విశ్రాంతి ఇచ్చి కుప్పం నుంచి నేను పోటీ చేస్తా: భువనేశ్వరి

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తుంటే.. మరోవైపు పొత్తుల నేపథ్యంలో టీడీపీ-జనసేన

Medaram Jathara: మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

తెలంగాణ కుంభమేళాగా పేరు గడించిన మేడారం మహా జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. గిరిజనుల ఆరధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఊళ్లకు ఊళ్లు మేడారం వైపే కదిలాయి.

SGT Posts:ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై స్టే విధించింది.

SRK-Sandeep Reddy:ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్.. ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి..

బాలీవుడ్ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల(Dadasaheb phalke film festival)