Motkupalli: చంద్రబాబును చంపాలని చూస్తున్నారు.. మోత్కుపలి సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Saturday,October 21 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మరోసారి స్పందిస్తూ ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యువకుడు, ఉత్సాహవంతుడు ఒకసారి అవకాశం ఇస్తే బాగా పాలిస్తాడనే ఉద్దేశంతో ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. తాను కూడా ఎన్నికల్లో వైసీపీ ఓటేయాలని పిలుపునిచ్చానన్నారు. అయితే అధికారంలోకి రాగానే జగన్‌కు మైకం, అహంకారం కమ్మిందని విమర్శించారు. తన విజయానికి పాటు పడ్డ తల్లిని, జైలులో ఉండగా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన చెల్లిని బయటకు పంపించిన వ్యక్తి అని మండిపడ్డారు. ప్రజా నాయకుడైన చంద్రబాబును జైలుకు పంపి జగన్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చంద్రబాబును చంపాలని చూస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత..

జగన్‌ నీకేమైనా సిగ్గుందా.. చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడిని అరెస్టు చేయిస్తావా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడే నేత కాదని, క్రిమినల్ అసలే కాదన్నారు. చంద్రబాబు అవినీతి చేస్తే ఈ నాలుగేన్నరళ్ల పాలనలో ఏంచేశావని.. ఎన్నికల ముందే ఎందుకు అరెస్ట్ చేశావని నిలదీశారు. జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారంలో ఉండగా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలకు ఖర్చు పెట్టిన చంద్రబాబు ముష్టి రూ.370 కోట్లకు ఆశపడతారా అని ప్రశ్నించారు. జైలులో నుంచి చంద్రబాబును బయటకు రాకుండా చూసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? అని నిలదీశారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం జగన్ అని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందుతో హల్‌చల్..

అంతకుముందు ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందుతో హల్‌చల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్మి తాను పొరపాటు చేశానంటూ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు దళితులకు అన్యాయం జరిగితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు దళతబంధు అమలు కాకపోవడంతో దళిత యువత తనను ప్రశ్నిస్తోందని.. కేసీఆర్ ముహూర్తం పెడితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్.. ఎంత మంది చెప్పినా వినకుండా బీఆర్‌ఎస్‌లో చేరానని పేర్కొ్న్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెజార్టీ సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీకి ఒక అవకాశం ప్రజలకు పిలుపునిచ్చారు.