Uttam Kumar Reddy: కృష్ణా నది జలాల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదు: ఉత్తమ్

  • IndiaGlitz, [Monday,February 12 2024]

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కృష్ణా నదీ జలాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టిన ఆయన ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదని ఉత్తమ్ స్పష్టంచేశారు. గతేడాది నవంబర్ 30న పోలింగ్ రోజు అప్పటి సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్‌తో లాలూచీ పడి నాగార్జున సాగర్‌పైకి ఏపీ పోలీసులను పంపించి తెలంగాణ, ఆంధ్ర కొట్లాటతో లబ్ధి పొందాలనుకున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ ఓడిపోబోతున్నారనే కారణంతో సాగర్‌పైకి జగన్‌ పోలీసులను పంపినట్లు అనిపిస్తోందని వెల్లడించారు.

అలాగే కేసీఆర్ ఓ అడుగు ముందుకేసి రాయలసీమకు నీళ్లు అందించారని జగన్ పొగిడిన ప్రసంగాన్ని అసెంబ్లీలో ప్రదర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని మండిపడ్డారు. జగన్‌, కేసీఆర్‌ గంటల తరబడి మాట్లాడుకున్నారని.. కలిసి బిర్యానీలు తిన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్‌ పొగిడారని తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని పేర్కొన్నారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపిందని.. ఢిల్లీ వెళ్లి ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకొన్నారని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉందని ఉత్తమ్ వెల్లడించారు.

కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రత్యేక రాష్ట్రంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయని.. ఇన్ ఫ్లో తగ్గి డైవర్షన్ పెరిగిందన్నారు. కృష్ణా జలాలను అదనంగా ఏపీ ప్రభుత్వం తరలిస్తున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డికి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ వైఎస్ హయాంలో 44వేల క్యూసెక్కులను.. 2020లో ఏపీ సీఎం జగన్ 90వేలకు పెంచారని వెల్లడించారు. అయినా అప్పటి కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.