కోట్లాది మంది కల సాకారం.. గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడు..

  • IndiaGlitz, [Monday,January 22 2024]

యావత్ దేశం 500 సంవత్సరాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుతమైన క్షణం ఆవిష్కృతమైంది. తన జన్మభూమిలో జయజయ ధ్వానాల మధ్య రాములోరు కొలువుదీరారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నులపండువగా కొనసాగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు ఘనంగా ముగిసింది. మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్ అనందీబెన్ పాటిల్‌, ప్రధాన అర్చకుడు మాత్రమే రామాలయం గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు.

రాముడి ప్రాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్నివేల మంది ప్రత్యక్షంగా.. కోట్లాది మంది ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. అపూర్వమైన చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా అనీర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. దీంతో దేశమంతా రామ నామ స్మరణతో మారుమోగింది. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసిన అనంతరం అయోధ్య రామాలయంపై పూలవర్షం కురిసింది.హెలికాప్టర్లతో ఆలయంపై పూలవర్షం కురిపించారు.

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభర ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అటు ప్రాణప్రతిష్ట క్రతువు సందర్భంగా అయోధ్య నగరమంతా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోమోగింది.