Mudragada Daughter:ముద్రగడకు ఊహించని షాక్ ఇచ్చిన కూతురు.. పవన్ కల్యాణ్‌కు మద్దతు..

  • IndiaGlitz, [Friday,May 03 2024]

ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న స్థానం పిఠాపురం. జనసేన అధినే పవన్ కల్యాణ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం. పవన్‌ను ఎలాగైనా ఓడించాలని అధికార వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఆర్థిక, అంగ బలంతో పవన్‌కు చెక్ పెట్టాలని చూస్తోంది. మరోవైపు జనసేన కూడా ఈసారి ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే అని వైసీపీకి ధీటుగా నిలబడుతోంది. దీంతో అక్కడ ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే పిఠాపురంలోని ఓ మండలానికి కాపు నేత ముద్రగడ పద్మనాభంను ఇంఛార్జ్‌గా సీఎం జగన్ నియమించారు. దీంతో పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే తన లక్ష్యమంటూ ముద్రగడ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఆయన్ను ఓడించకపోతే ఏకంగా తన పేరును కూడా మార్చుకుంటానని సవాల్ చేశారు. దీంతో ముద్రగడకు సొంత కుటుంబం నుంచే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ముద్రగడ వ్యాఖ్యలపై ఆయన కుమార్తె క్రాంతి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించటానికి వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్న పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభం బదులు పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని తెలిపారు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదు. వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించడానికి కష్టపడొచ్చు.. కానీ పవన్ కళ్యాణ్‌ను, ఆయన అభిమానుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉండకూడదు. మా నాన్నను కేవలం పవన్ కళ్యాణ్‌ను తిట్టడం కోసమే జగన్ మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్న పద్మనాభం ఎటూ కాకుండా అయిపోతారు. ఈ విషయంలో నేను మా నాన్న తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నావంతుగా కృషి చేస్తా' అంటూ వీడియోలో ప్రస్తావించారు. దీంతో ముద్రగడకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం క్రాంతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. పవన్‌ను ఓడించి పిఠాపురం నుంచి పంపకపోతే తన పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. నోరుంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. దీంతో ముద్రగడ వ్యాఖ్యలపై జనసైనికులు ఇప్పటికే ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఆయన సొంత కుమార్తె క్రాంతి కూడా కౌంటర్ ఇస్తూ పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.