మూడు విభిన్నమైన పాత్ర‌ల్లో..

  • IndiaGlitz, [Monday,June 18 2018]

తమిళ క‌థానాయ‌కుడు శ‌ర‌త్ కుమార్‌కు తెలుగులోనూ న‌టుడిగా మంచి గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌లు చిత్రాల్లో విల‌న్‌గానూ, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ త‌న న‌ట‌న‌తో మెప్పించారాయ‌న‌. ఇప్పుడు ఆయ‌న కుమార్తె వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కూడా న‌టిగా నిరూపించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇప్ప‌టికే జాతీయ అవార్డు గ్ర‌హీత బాలా రూపొందించిన తారా త‌ప్ప‌ట్టైతో న‌టిగా పేరు తెచ్చుకున్న వ‌ర‌ల‌క్ష్మీ.. ఈ ఏడాది మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగ‌మ‌య్యారు.

ఆ చిత్రాలన్నింటిలోనూ విభిన్న‌మైన పాత్ర‌లు చేస్తున్నారామె. విశాల్ హీరోగా రూపొందుతున్న 'పందెం కోడి' సీక్వెల్‌లో విల‌న్‌గానూ.. విజ‌య్‌తో మురుగ‌దాస్ రూపొందిస్తున్న చిత్రంలో రాజ‌కీయ నేత‌గానూ.. ధ‌నుష్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న 'మారి 2'లో క‌లెక్ట‌ర్ పాత్ర‌లోనూ వ‌ర‌ల‌క్ష్మీ క‌నిపించ‌నున్నారు. ఈ మూడు చిత్రాలూ తెలుగులోనూ అనువాదం కానున్నాయి. వీటిలో 'మారి 2' ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాలు అందించే ఫ‌లితాల‌తో.. తెలుగులోనూ వ‌ర‌ల‌క్ష్మీకి పేరు, అవ‌కాశాలు వ‌చ్చే ఛాన్స్ లేక‌పోలేదు.