భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కోసం చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్

  • IndiaGlitz, [Saturday,February 19 2022]

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘‘భీమ్లా నాయక్’’ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా.. ఈ నెల 21న హైదరాబాద్ యూసఫ్‌గూడ గ్రౌండ్స్ లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చీఫ్‌ గెస్ట్‌గా హాజరవ్వనున్నట్లు సమాచారం. సినీ ప్రముఖులతో కేటీఆర్‌కి తొలి నుంచి మంచి అనుబంధం ఉంది. గతంలోనూ కొన్ని ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌కు కేటీఆర్ హాజరయ్యారు.

కాగా.. ‘‘భీమ్లా నాయక్‌’’ను తొలుత సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే దీనికి ముందు వెనుకా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానుండటంతో చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25కి భీమ్లా నాయక్ వాయిదా పడింది. ఈ నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. సంక్రాంతికి తమ హీరో సినిమా చూద్దామనుకున్న ఫ్యాన్స్ నిరాశకు లోనవ్వడంతో వారిని ఖుషీ చేసేందుకే ‘‘లాలా భీమ్లా’’ డీజే వర్షెన్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తున్నారు.