Metro:హైదరాబాద్‌కు నాలుగు వైపులా మెట్రో విస్తరణ.. కేసీఆర్ బృహత్ ప్రణాళిక, మారిపోనున్న భాగ్యనగర దశ-దిశ

  • IndiaGlitz, [Tuesday,August 01 2023]

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భాగ్యనగరంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మెట్రోను నగరం నలువైపులా విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.69,100 కోట్లతో మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఫేజ్ 3లో 278 కిలోమీటర్ల పొడవునా కొత్తగా ఎనిమిది రూట్లతో పాటు ఔటర్ వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రోను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. ఫార్మాసిటీ రానుండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి జల్‌పల్లి, తుక్కుగూడల మీదుగా కందుకూరు వరకు మెట్రోను విస్తరిస్తారు. వరదలు, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గానికి ఇప్పటికే శంకుస్థాపన :

హైదరాబాద్‌లో ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కొత్తగా జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఒక దానిపై వాహనాలు, మరో దానిపై మెట్రో రైలు రాకపోకలుంటాయి. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు , ఇస్నాపూర్ నుంచి మియాపూర్‌కు.. మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు... ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు.. ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు మెట్రోను విస్తరించనున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మెట్రో విస్తరణలో భాగంగా కొత్తూరు-షాద్ నగర్ వరకు , ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలు, ప్రతిపాదనలు పంపాల్సిందిగా మెట్రో రైల్ అథారిటీ, పురపాలక శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.