Telangana BJP: లోక్‌సభ ఎన్నికలపై టీబీజేపీ ప్రత్యేక కసరత్తు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు ప్రకటన..

  • IndiaGlitz, [Monday,January 08 2024]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి తహతహలాడుతున్న కమలనాథులు అందుకు తగ్గట్లు కార్యాచరణతో ముందుకు పోతున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలను ప్రిస్టేజ్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో పాగా వేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇంఛార్జ్‌లను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు.

రాష్ట్రంలో ఉన్న 17 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలవగా.. ఈసారి అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. కనీసం 10 స్థానాల్లో గెలిచేందుకు సిద్ధమైంది. అందుకే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్‌లు వీరే..

అదిలాబాద్ – పాయక్ శంకర్ (ఎమ్మెల్యే)
పెద్దపల్లి – రామారావు పవార్ (ఎమ్మెల్యే)
కరీంనగర్ – ధనపాల్ సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి (ఎమ్మెల్యే)
జహీరాబాద్ – కాటేపల్లి వెంకటరమణ రెడ్డి (ఎమ్మెల్యే)
మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
సికింద్రాబాద్ – కె. లక్ష్మణ్ (ఎంపీ)
హైదరాబాద్ – రాజాసింగ్ (ఎమ్మెల్యే)
చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి (ఎమ్మెల్సీ)
మహబూబ్ నగర్ – రామచంద్రరావు (మాజీ ఎమ్మెల్సీ)
నాగర్ కర్నూల్ – మాగం రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)