RGV ఆఫీసు వద్ద టీడీపీ, జనసేన కార్యకర్తల ఆందోళన.. కుక్కలు మొరుగుతున్నాయంటూ ఆర్జీవీ ఫైర్

  • IndiaGlitz, [Tuesday,December 26 2023]

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా వివాదాలకు కారణమవుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అభ్యంతరకరంగా చూపించారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రామ్‌గోపాల్ వర్మ ఆఫీస్ వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. ‘‘వ్యూహం’’ సినిమాకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగి పోస్టర్లను, వర్మ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఆర్జీవీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానా రచ్చ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. దీనిపై వర్మ ఘాటుగా స్పందించారు. హేయ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌.. నా ఆఫీసు బయట మీ కుక్కలు మొరుగుతున్నాయి. పోలీసులు రాగానే వాళ్లు పారిపోయారు అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు , రాజకీయంగా ఎదుగుదల, పాదయాత్ర, సీఎంగా పగ్గాలు తదితర ఘటనలను ఈ చిత్రంలో చూపించినట్లుగా తెలుస్తోంది. వ్యూహం నుంచి వచ్చిన పోస్టర్లు, ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌లు వివాదాస్పదమయ్యాయి. వాటిలోని పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లను అభ్యంతరకరంగా చిత్రీకరించారటూ జనసేన, టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. సినిమా విడుదలన అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇకపోతే.. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిపికేట్ రద్దు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న వ్యూహం సినిమా విడుదల కానుండగా.. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరపగా.. టీడీపీ తరపున మురళీధర్ రావు వాదనలు వినిపించారు. ఈ సినిమాను పొలిటికల్ అజెండాతో రూపొందించారని, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులపై బురద జల్లేలా సినిమాను తెరకెక్కించారని మురళీధర్ రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీకి అనుకూలంగా సినిమాను తీశారని.. దీని ప్రభావం త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికలపై పడుతుందని పేర్కొన్నారు. ఈ సినిమా ఈవెంట్స్‌లకు సైతం వైసీపీ నేతలు, మంత్రులు హాజరైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.