TDP Chief Chandrababu:టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట..

  • IndiaGlitz, [Wednesday,October 18 2023]

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట దక్కింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ నేటితో ముగియడంతో హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఉందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంలో తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఈ కేసుకు అది వర్తిస్తుందని వివరించారు. అలాగే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పైనా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. వారి వాదనలను అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణనను నవంబర్ 7కు వాయిదా వేసింది.

క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వచ్చే ఛాన్స్..

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ ముగింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో శుక్రవారం ఈ రెండు కేసుల్లో తీర్పు వచ్చే అవకాశముంది. ఒకవేళ క్వాష్ పిటిషన్‌కు మద్దతుగా తీర్పు వస్తే చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన అన్ని కేసుల్లోనూ రిలీఫ్ దొరకనుంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కోసం టీడీపీ శ్రేణులు వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతల బృందం..

మరోవైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం ఇవాళ(బుధవారం) సాయంత్రం కలవనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, నాయకుల గృహనిర్బంధం అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు వివరించనున్నారు. గవర్నర్‌ను కలిసే టీడీపీ బృందంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమా ఉన్నారు.