Bigg Boss 7 Telugu : ఇంటిలో ఫస్ట్ నైట్ గోల , డబుల్ మీనింగ్ డైలాగ్స్ .. అండర్ వాటర్‌లో వెతుకులాట ..!!

  • IndiaGlitz, [Friday,October 20 2023]

అసలే బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై సాంప్రదాయవాదులు, ఓ వర్గం ఎప్పుడూ భగ్గుమంటూ వుంటారు. అందులో కంటెస్టెంట్స్ శృతిమించి ప్రవర్తిస్తూ వుండటం, పెళ్లి కాకుండా అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే గదిలో రోజుల తరబడి వుండటం, ముద్దు ముచ్చట్లను వారు తప్పుబడుతూ వుంటారు. అంతేకాదు.. బిగ్‌బాస్ షోను రద్దు చేయాల్సిందిగా కోర్టులను ఆశ్రయించిన ఘటనలు కూడా వున్నాయి. ఇకపోతే.. బిగ్‌బాస్ 7 తెలుగులో భోలే షావళి, ప్రియాంకల మధ్య బూతుల యుద్ధం జరగగా.. ఇప్పుడు ఏకంగా ఫస్ట్ నైట్ అంటూ రొమాన్స్ చేయించడం పట్ల పలువురు మండిపడుతున్నారు. ఈ స్కిట్ పూర్తిగా డబుల్ మీనింగ్‌తో నిండిపోయింది.

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఒక స్పేస్ షిప్ గులాబీపురం, జిలేబీపురం మధ్యలో క్రాష్ అయ్యిందని.. ఎవరైతే గ్రహంతరవాసులను మెప్పిస్తారో వారికి ఆ ఊరి నుంచి కెప్టెన్సీ వస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఇంటి సభ్యులు గులాబీపురం, జిలేబీపురంగా విడిపోయారు. ఇందులో గులాబీపురం సర్పంచ్‌గా శోభాశెట్టి.. ఆమెకు మాజీ భర్తగా తేజ.. ఎన్ఆర్ఐగా ప్రిన్స్ యావర్, టీస్టాల్ నడుపుకునే అబ్బాయిగా అమర్‌దీప్, శోభాతో తిరిగే వ్యక్తిగా గౌతమ్, చిల్లరగా తిరిగే అమ్మాయిగా పూజా నటించారు.

జిలేబీపురం విషయానికి వస్తే.. ప్రియాంక సర్పంచ్‌గా , భోలే జ్యోతిష్యుడిగా , సందీప్‌ ఓ కిల్లీకొట్టు నడుపుకునే వ్యక్తిగా, అశ్విని అందమైన అమ్మాయిగా, గ్రామంలో రౌడీగా అర్జున్, అతని అనుచరుడిగా ప్రశాంత్ నటించారు. శివాజీకి వయసుకు తగినట్లుగా రెండు వూళ్లకి పెద్దగా నటించారు. ఏ వూరి ప్రజలు గ్రహంతరవాసులను సంతోషపెడతారో, వారికి కెప్టెన్సీ పోటీదారులుగా అవకాశం లభిస్తుంది. తొలి రోజు ఎవరి పాత్ర మేరకు వారు బాగానే రాణించి కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా శోభాశెట్టి, టేస్టీ తేజాలు బాగా ఆకట్టుకున్నారు.

ఇవాళ అండర్ వాటర్‌లో బాక్స్‌లో వున్న గ్రహంతరవాసుల వస్తువు వారికి వెతికి ఇవ్వాలని టాస్క్ ఇచ్చాడు. గులాబీపురం నుంచి అమర్, తేజ.. జిలేబీపురం నుంచి ప్రియాంక, సందీప్‌లు ఈ గేమ్‌లో పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్ లోపల బాక్స్‌‌‌లో వున్న కీ వెతికి తన పార్ట్‌‌నర్‌కి ఇవ్వాలి. ఎవరైతే ముందుగా ఆ వస్తువు సాధిస్తారో వారే విజేత. గేమ్ స్టార్ట్ అయ్యాక సందీప్, అమర్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఎట్టకేలకు సందీప్ ఆ వస్తువును సాధించడంతో జిలేబీపురం గెలిచింది.

ఇంతలో టేస్టీ తేజ ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.. ఈ రోజు తన పెళ్లి రోజని, ఫస్ట్ నైట్ రోజు ఇదే డ్రెస్ వేసుకున్నా అంటూ గ్రామంలో చెప్పుకుని తిరుగుతాడు. శోభాశెట్టిని కూడా ఆటపట్టించాడు. దీనికి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే అలా అనొద్దంటూ తేజాను కొట్టింది. శివాజీ సైతం రెండు వూళ్లకు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూనే .. జిలేబీపురం గ్రామ సర్పంచ్‌ ప్రియాంకా లైన్ వేస్తున్నట్లు కనిపించింది. నువ్వు నడుస్తుంటే.. నెమలి నాట్యమాడుతున్నట్లుంది అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ స్కిట్ పెద్దలకు మాత్రమే అన్నట్లుగా వుంది. అనంతరం గ్రహంతరవాసుల మెషిన్‌ని ‌ఛార్జ్ చేసేందుకు ‌వైర్లని సాకెట్స్‌కి కనెక్ట్ చేయాల్సి వుంటుంది. కాకపోతే ఆ వైర్లు చిక్కు ముడులుగా వుంటాయి. వాటిని జాగ్రత్తగా తీసి ఏ కలర్ వైర్‌ని ఆ కలర్ సాకెట్‌లో సెట్ చేయాల్సి వుంటుంది. ఈ టాస్క్‌లో గులాబీపురం నుంచి గౌతమ్. జిలేబీపురం నుంచి ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ టాస్క్‌లో గౌతమ్ ఎక్కువ వైర్లు కనెక్ట్ చేసి విజయం సాధించాడు.