ఐడీ దాడులపై స్పందించిన తాప్సీ

  • IndiaGlitz, [Saturday,March 06 2021]

హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇళ్లపై గత మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోంది. దీనిపై తాజాగా ట్విటర్ వేదికగా తాప్సీ స్పందించింది. తన ఇంట్లో ప్రధాన మూడు విషయాలపై ఐటీ శోధనంతా సాగిందని ఆరోపించింది. వాటిని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ‘‘ప్రధానంగా మూడింటిని తెలుసుకోవాలనే లక్ష్యంతో ఈ శోధన జరిగింది.

1) నాకు పారిస్‌లో బంగ్లా ఉందని ఆరోపించారు కదా.. ఆ ఇంటి తాళాలు కోసం శోధించారు. ఎందుకంటే వేసవి వస్తోంది.

2) అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుందనే ఆశతో రూ.5 కోట్ల రిసీప్ట్ కోసం వెతికారు. ఎందుకంటే ఆ డబ్బును నేను గతంలో తిరస్కరించాను.

3)అలాగే గౌరవనీయ ఆర్థిక మంత్రిగారు చెప్పినట్టు 2013లో నాపై జరిగిన ఐటీ దాడుల జ్ఞాపకాన్ని కూడా శోధించాను’’ అని తాప్సీ ట్వీట్‌లో పేర్కొంది. తాప్సీ దగ్గర దాదాపు 5 కోట్ల రూపాయలకు సంబంధించి లెక్కలు లేవని, వీటికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచి ఐటీ ఎగవేతకు పాల్పడ్డారని.. అలాగే అనురాగ్ కశ్యప్ 20 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ సోదాల్లో భాగంగా తాప్సీ, అనురాగ్ కశ్యప్‌తో పాటు పలు నిర్మాణ రంగ కంపెనీలకు సంబంధించిన 7 లాకర్స్‌ను గుర్తించారు. ఆదాయపు శాఖ అధికారులు. ప్రస్తుతం వాటి వివరాలను రాబట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

కాగా అనురాగ్ కశ్యప్, తాప్సీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తూ పోస్ట్‌లు పెట్టిన సంగతి తెలిసిందే. దానికి కక్ష సాధింపు చర్యలే ఈ ఐటీ దాడులంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అనూహ్యంగా జరిగిన ఈ ఐటీ రైడ్స్ బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక, ఈ ఐటీ దాడులపై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందిస్తూ.. ఇలాంటి దాడులు సర్వ సాధారణమని... 2013లోనూ వాళ్లపై ఐటీ దాడులు జరిగాయని పేర్కొన్నారు.