Gautham Adani: హిండెన్‌ బర్గ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అదానీకి భారీ ఊరట..

  • IndiaGlitz, [Wednesday,January 03 2024]

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Adani)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్(Hindenburg) నివేదికపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) దర్యాఫ్తులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ కేసులో సిట్ దర్యాఫ్తు అవసరంలేదని స్పష్టం చేసింది. మీడియా రిపోర్ట్‌లు ఆధారంగా దర్యాప్తు చేయలేమంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు బదిలీకి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

సెబీ పరిధిలోకి ప్రవేశించడానికి తమ అధికారం పరిమితమైనదని అభిప్రాయపడింది. మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సెబీ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని సూచించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది.

కాగా స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ పెంచుకునేందుకు అదానీ గ్రూపు(Adani Group) అవకతవకలకు పాల్పడిందని అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్ బర్గ్ కంపెనీ గతేడాది సంచలన ఆరోపణలు చేసింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. దీనిపై చర్చ చేపట్టాలని.. అదానీపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌ను విపక్షాలు స్తంభింపజేశాయి. దీనిపై దర్యాప్తు కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సెబీ దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అయితే విచారణను సెబీ సక్రమంగా నిర్వహించడం లేదని, ఈ కేసును సిట్‌కు బదిలీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం గతేడాది నవంబర్ 24న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా తుది తీర్పు వెల్లడించింది.