Supreme Court:స్వలింగ సంపర్కుల వివాహాలు,  చట్టబద్ధత : సుప్రీంకోర్టు సంచలన తీర్పు .. సీజేఐ కీలక వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Tuesday,October 17 2023]

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఎల్‌జీబీటీక్యూఐఏ ప్లస్ వర్గాలకు చెందిన వ్యక్తుల వివాహానికి తాము చట్టబద్ధత కల్పించలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు తీర్పులను వెలువరించింది సుప్రీంకోర్ట్. తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని 20 స్వలింగ జంటలు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. దీనిపై పార్లమెంటే చట్టం చేయాలన్న ధర్మాసనం.. స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్ష చూపొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఇక తీర్పు సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్చడం పార్లమెంట్ బాధ్యత అని పేర్కొన్నారు. కోర్టు చట్టాన్ని రూపొందించదని, కానీ దానిని అర్ధం చేసుకుని అమలు చేయగలదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. స్వలింగ సంపర్కం అనేది కేవలం నగరాలు, ఉన్నత వర్గాలకే పరిమితమైంది కాదని.. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు అవసరమా.. లేదా ..? అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. భిన్న లింగ జంటలు మాత్రమే మంచి జంటలుగా వుంటారని చట్టం భావించడం లేదని, అలా చేస్తే అది హోమో సెక్సువాలిటీ జంటలపై వివక్షేనని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వీటిపై ఎలాంటి వివక్ష చూపకుండా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని.. అందరూ సమామనేమనని సీజేఐ వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరికీ వారి జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు వుంటుందని.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించడం అనేది ప్రాథమిక హక్కు అని సీజేఐ స్పష్టం చేశారు. వివాహానికి చట్టబద్ధమైన హోదా వుంటుందని , అది ప్రాథమిక హక్కు కాదని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి వాటికి చట్టపరమైన హోదా ఇస్తే అవసరమైన వారు హక్కులు పొందుతారని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అలాగే వివాహేతర జంటలతో సమానంగా స్వలింగ జంటలు కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు.