Mahesh Babu: వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో మహేశ్.. ఆ నగరాల్లో ఏఎంబీ మాల్స్ ..!!

  • IndiaGlitz, [Wednesday,April 26 2023]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. పాలవంటి తెల్లని మేయని ఛాయతో గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు. ఇక అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు కాబోయే భర్త.. అచ్చం మహేశ్ లాగే వుండాలని కలలు కంటూ వుంటారు. వరుస బ్లాక్ బస్టర్లలతో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన మహేశ్.. సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలోనూ పాల్గొంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్‌తో పోటీపడే ఒకే ఒక్క దక్షిణాది నటుడు మహేశ్ మాత్రమే. ఇప్పటికే దాదాపు డజనుకు పైగా బ్రాండ్ల ప్రమోషన్స్ చేపట్టిన సూపర్ స్టార్ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

థియేటర్, వస్త్ర వ్యాపారంలో మహేశ్:

ప్రస్తుతం సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ రంగాల్లో రాణిస్తూనే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ లిస్ట్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా చేరిపోయారు. వినూత్నంగా ఆలోచిస్తూ రియల్ లైఫ్‌లోనూ బిజినెస్‌మెన్‌గా రాణిస్తున్నారు సూపర్‌స్టార్. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్ పేరుతో అతిపెద్ద మల్లిప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇది భాగ్యనగరానికే ఐకాన్‌గా మారింది. ఇక నిర్మాతగానూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ది హంబుల్ కో పేరుతో వస్త్ర వ్యాపారంలో కూడా అడుగుపెట్టారు. అలాగే ఏషియన్‌తో కలిసి ఫుడ్ బిజినెస్‌లోనూ దిగారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 12లో ‘‘ఏఎన్’’ రెస్టారెంట్ ఓపెన్ చేశారు మహేశ్.

బెంగళూరు, విశాఖలలో ఏఎంబీ మాల్స్ :

అయితే తన వ్యాపార సామ్రాజ్యాన్ని మహేశ్ విస్తరించాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులోనూ ‘‘ఏఎంబీ’’ మాల్ ఓపెన్ చేయనున్నారు. అక్కడి గాంధీనగర్‌లో ఇప్పటికే కన్‌స్ట్రక్షన్ ప్రారంభమైనట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బెంగళూరు నగరం వరల్డ్ క్లాస్ సిటీ కావడంతో పాటు ఐటీ హబ్ కావడంతో హైదరాబాద్ కంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో థియేటర్‌ను నిర్మిస్తున్నారట మహేశ్. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పోర్ట్ సిటీ విశాఖలోనూ ఏషియన్ సునీల్‌తో కలిసి మల్టీప్లెక్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన వ్యాపారాలను పక్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు మహేశ్.