ఎన్.టి.ఆర్ తో ప్లాన్ చేస్తున్నారట...

  • IndiaGlitz, [Saturday,September 05 2015]

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు.

ఉయ్యాలా జంపాలా', సినిమా చూపిస్త మావ' చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపును పొందిన రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం.

సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్ ను పూర్తిచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషనల్ వీడియో సాంగ్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఒక సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందట. దాన్ని కూడా పూర్తి చేసి సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.