జనసేనానిని కలిసిన సుదీప్.. ఆసక్తికర విషయం ఏంటంటే..

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారితో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ వెళ్లారు. ఈ సందర్భంగా పవన్‌కు సుదీప్ ఓ మొక్కను బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి... ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి పవన్‌కు సుదీప్ వివరించారు.

కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే... ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం. ‘ఈగ’ సినిమాతో టాలీవుడ్‌లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న సుదీప్ ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్ష‌న్‌లో పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కనున్న సినిమాతోపాటు మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పారు.