SSC Exams:నిన్న పేపర్ లీక్.. ఈరోజు ఆన్సర్ షీట్ల కట్ట మిస్సింగ్, తెలంగాణలో ఏం జరుగుతోంది..?
- IndiaGlitz, [Tuesday,April 04 2023]
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట కాస్తంత మసకబారింది. ఈ కేసులో రంగంలోకి దిగిన సిట్ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది. అయితే విపక్షాలు మాత్రం మంత్రి కేటీఆర్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, కమీషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో నిన్న పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంతో మరోసారి తెలంగాణ ఉలిక్కిపడింది. అయితే తాజాగా సోమవారం నాడు జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆన్సర్ షీట్లలోని ఓ కట్ట మాయమైంది. దీంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఆ ఆన్సర్ షీట్ ఏమైనట్లు :
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో దాదాపు 1000 మంది విద్యార్ధులు, 5 పరీక్షా కేంద్రాల్లో తెలుగు పరీక్ష రాశారు. పరీక్ష ముగిసిన అనంతరం ఆ ఎగ్జామ్ సెంటర్ల ఇన్ఛార్జ్లు ఆన్సర్ షీట్ల బండిల్స్కు షీల్ వేసి తపాలా కార్యాలయంలో అప్పగించారు. అనంతరం అక్కడి సిబ్బంది వాటిని ఇవాల్యుయేషన్ సెంటర్స్కు తరలించేందుకు గాను బస్టాండ్కు ఓ ఆటోలో వచ్చారు. అనంతరం వాటిని మరోసారి లెక్కించగా.. 11 కట్టలకు బదులు పదే వున్నాయి. దీంతో భయపడిన సిబ్బంది.. ఆ కట్ట కోసం తీవ్రంగా గాలించారు. వారు బస్టాండ్కు ప్రయాణించిన మార్గంలోనూ వెతికారు. లాభం లేకపోవడంతో తపాలా కార్యాలయ అధికారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వికారాబాద్లో:
కాగా.. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడం రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పేపర్ వాట్సాప్లో ప్రత్యక్షమైంది. దీనిపై తెలంగాణ విద్యాశాఖ సీరియస్గా స్పందించింది. ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పేపర్ లీక్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే తెలంగాణలో వరుసపెట్టి పేపర్ లీక్లు జరుగుతూ వుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.