సోనూసూద్‌కు చేతులెత్తి నమస్కరించిన స్మృతీ ఇరానీ

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా.. రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు సోనూసూద్ మాత్రం మొదట 1500 పీపీఇ కిట్లు పంజాబ్‌లో డాక్టర్లందరికీ ఇవ్వడం.. ఆ తర్వాత ముంబైలోని తన హోటల్‌ను హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ ఇవ్వడం.. రంజాన్‌ మాసంలో వేలాది మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం లాంటి మంచి పనులు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్లు టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో చూసి చలించిన ఆయన.. వారికి నేనున్నా అంటూ అభయమిచ్చి ప్రత్యేక బస్సుల్లో మహారాష్ట్ర నుంచి గుల్బర్గా, కర్నాటక.. ఉత్తరప్రదేశ్ నుంచి లఖ్‌నవో, జార్ఖండ్, బీహార్‌తో పాటు మరికొందర్ని వారి స్వగ్రామాలకు తరలించారు. ఇన్నెన్ని మంచి పనులు చేసిన సోనూసూద్‌కు ఎవరైనా సెల్యూట్ కొట్టక మానరు.

చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఇప్పటికీ ట్విట్టర్‌లో తనను ట్యాగ్ చేస్తూ సాయం కోరితే టీమ్‌తో ముందుకెళ్తున్నారు. సోనూ సేవలను గుర్తించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఎమోషనల్ అయ్యి చేతులెత్తి నమస్కారం చేసేశారు. ‘సోనూ సూద్.. నటనా రంగ సహచరుడిగా మీ గురించి రెండు దశాబ్దాలుగా తెలుసు. అది ఓ గౌరవంగా భావిస్తాను. మీరు నటుడిగా ఎదగడం పట్ల సంతోషించాను. కానీ ఇప్పటి విపత్కర పరిస్థితులు సవాళ్లు విసురుతున్న సమయంలో మీరు చూపిస్తున్న సానుభూతి నన్ను ఇప్పటికీ గర్వపడేలా చేస్తోంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటున్న మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను..’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన సోనూ సూద్ అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.