భూమనను ఎదుర్కోవాలంటే 'మాయా' లాగా మారాలి!
Send us your feedback to audioarticles@vaarta.com
"సోదరి మాయావతి ప్రధానిగా తిరిగి తిరుపతిలో అడుగుపెట్టాలి. మాయావతి గారు ఎన్నో కష్టాలుపడి వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కి, రాజకీయాలకు వేల కోట్లు అవసరం లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మాదిరి గూండాలతో పనిలేదు. తనపై నమ్మకంతో వచ్చిన సైన్యం సాయంతో నాలుగుసార్లు అతిపెద్ద రాష్ట్రం యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తిరుపతి వేదికగా జరిగిన బహుజన జనసేన యుధ్దభేరి సభలో మాయావతి మాట్లాడుతూ.. "చాయ్వాలా మోడీ కాస్తా ఇప్పుడు చౌకీదార్ అయిపోయారు. ఈ చౌకీదార్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకుండా చేశారు. మోడీ గారికి తీసుకోవడమేగాని ఇవ్వడం అలవాటు లేదు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారు.బీజేపీ కన్వినెంట్ పాలిటిక్స్ చేస్తోంది.
నన్ను వెంకటగిరిలో సభ పెట్టనీయకుండా చేసింది. వారికి అండగా ఉన్న వైసీపీకి, చేతగాని టీడీపీకి చెప్పండి.. ఇది 2009 కాదు 2019 అని. ఇలాంటి వ్యవస్థలను పక్కన పెట్టాలి. వారి పల్లకీలు మోసి మోసి అలసిపోయాం. మనం వారి పల్లకీలు మోస్తే వారు మనల్ని వదిలేస్తున్నారు. ఇది మారాలి కాన్షీరాం గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు , మాయావతి గారి అడుగు జాడల్లో నడిచి సరికొత్త భారతావనిని నిర్మిద్దాం. ఇదే తిరుపతిలో స్పెషల్ స్టేటస్ ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తానని ఏడుకొండల వాడి సాక్షిగా ఇచ్చిన హామీని గాలికి వదిలేస్తే, తెలుగు రాష్ట్రాలకు నేను అండగా ఉంటానని ముందుకు వచ్చిన మాతృమూర్తి మాయావతి గారికి పాదాభివందదనాలు. తిరుపతి వైసీపీ అభ్యర్ధి కరుణాకర్రెడ్డి పైకి అంతా సమానం అంటారు. అన్ని చట్టాలు పాటిస్తాం అని చెబుతారు. ఎయిర్పోర్టులో అధికారుల చొక్కాలు పట్టుకుంటారు. దాడులు చేస్తారు. వారికి ఎదురు ఎవరైనా పోటీ చేస్తే ఇబ్బందులకు గురి చేస్తారు. యూపీలో వీధి వీధికి ఉన్న ఇలాంటి వ్యక్తులను చీల్చి చెండాడిన రుద్రకాళి సోదరి మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తితో కరుణాకర్రెడ్డిని ఎదుర్కోవాలంటే ప్రతి వీర మహిళా మాయావతి గారిలా మారాలి. సోదరి మాయావతి గారు ప్రేమతో అలయెన్స్కి అంగీకరిస్తే దాన్ని సందేహిస్తున్నారు. మీరు మనుషులకే విలువ ఇవ్వరు. దళితులు ఏం విలువ ఇస్తారు. కడపలో కొన్ని గ్రామాల్లో ఈ రోజుకీ నాయకుల ఇళ్ల మధ్య నుంచి చెప్పులు చేత్తో పట్టుకుని తిరిగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వీరు దళితుల్ని ఉద్దరిస్తారా.?" అని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను కాన్షీరాం గారికి, మాయావతికి ఏకలవ్య శిష్యుడిని...!
"తిరుపతి ఎంపిగా బరిలోకి బీఎస్పీ అభ్యర్ధిని నిలబెట్టాం. వారిని గెలిపించకపోతే దళితుల పట్ల ఏ మాత్రం గౌరవం ఇవ్వని, గుర్తింపు లేని వైసీపీ ముందుకు వెళ్తుంది. 2009లో కోట్లాది మంది అభిమానించే వ్యక్తి సామాజిక మార్పు ధ్యేయంగా పీఆర్పీ పెట్టారు. బలమైన మార్పు వస్తుందనుకున్నారు. ఏ పార్టీ ఇవ్వని విధంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి సీట్లు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే వైసీపీ నేతలు ఎవరూ ఎదగకుండా రాజకీయాలు చేస్తున్నారు. ఎంత కాలం వీరి పల్లకీలు మోస్తాం. జగన్, కరుణాకర్రెడ్డి లాంటి వారి పల్లకీలు మోసి మోసి భుజాలు అరిగిపోయాయి. వాళ్లు పాలించే వారు మనం పాలింపబడేవాళ్లమా.? చిరంజీవి లాంటి వ్యక్తినే ఆపేసిన విధానం ఏ రోజున మరచిపోను. వీళ్ల గూండాగిరిని తట్టుకునేందుకు చదలవాడ కృష్ణమూర్తి గారిని బరిలో నిలిపాను" అని పవన్ చెప్పుకొచ్చారు.
రౌడీయిజం రూపుమాపేందుకు...
"ఆయనకు మనం అండగా నిలబడకపోతే సుగుణమ్మ అల్లుడి రౌడీయిజం, కిరాణా షాపుల్ని సైతం బతకనివ్వని మామూళ్ల వసూళ్లు, కరుణాకర్రెడ్డి గూండాయిజాన్ని నిలువరించడం ఎలా.? టీడీపీ చైర్మన్గా పనిచేసి వెంకన్నకే విలువ ఇవ్వని వ్యక్తి, ఏడుకొండలవాడి నగలు ఎన్ని పోయాయో ఆయనకే తెలియదు. తిరుపతి నుంచి చెబుతున్నా టీడీపీ నాయకులు గానీ, వైసీపీ నాయకులు గానీ జనసైనికుల జోలికి వస్తే తాట తీసి కూర్చోబెడతా. మీరు పాలించే వారు మేం బానిసలుగా బతికే వారిమా.? మాకు ఆవేశం ఉంది. కోపం ఉంది. అయితే మీలా రోడ్ల మీదికి వచ్చి గొడవలు చేయం. కాన్షీరాం గారిలా.. ఓటు అనే ఆయుధంతో బలమైన మార్పు తీసుకువస్తాం. వారు కత్తులు పట్టుకుని వస్తున్నారు. మన దగ్గర అవి లేవు. మనం ప్రజాస్వామ్యవాదులం, ఓటు అనే ఆయుధంతో ముందుకు వెళ్దాం. ఇలాంటి పరిస్థితులు మారాలి అంటే రౌడీ మూకల తాట తీసిన సోదరి మాయావతి గారి స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. నేను కాన్షీరాం గారికి, మాయావతికి ఏకలవ్య శిష్యుడిని. వినోద్రాయల్ అనే అభిమాని హత్య బాధించింది. ఆ తల్లిని పలుకరించడానికి వచ్చినప్పుడు యువతలో ఇంత గొడవలు ఉన్నాయన్న విషయం తెలిసింది. నాడు మోడీ గారు ఇదే తిరుపతిలో ఇలాంటి సభలో కూర్చుని పవన్కళ్యాణ్ దేశభక్తుడు , ఏమీ ఆశించడు అంటూ పొగిడారు. పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. చట్టసభల్లో ఇచ్చిన మాటకు సైతం విలువ లేదు. టీడీపీ ధర్మపోరాట దీక్షలంటూ ఊగిపోవడం మినహా సాధించింది ఏమీ లేదు. గడచిన మూడేళ్లుగా హోదాపై గొంతెత్తిన ఏకైక పార్టీ జనసేన మాత్రమే" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
36 సార్లు నాలుక అటు ఇటు తిప్పే వ్యక్తి కాదు..
"మనం మాట్లాడిన 48 గంటల్లో ప్యాకేజీ అనే పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారు. వ్యతిరేకిస్తే తిట్టిపోశారు. బీజేపీ సర్కారు ఆంధ్రులకు చేసిన అన్యాయాన్ని, ద్రోహాన్ని నేను మరచిపోలేదు. మాయావతి గారు మాత్రం అడగకుండానే స్టేటస్ ఇస్తామని చెప్పారు. చంద్రబాబు గారిలా 36 సార్లు నాలుక అటు ఇటు తిప్పే వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసిన బీజేపీ, పది సార్లు మభ్యపెట్టిన చంద్రబాబు, ఏపీకి స్టేటస్ని వ్యతిరేకించే కేసీఆర్తో చేతులు కలిపిన జగన్మోహన్రెడ్డి ఇక్కడ ఉన్నారు. వీరందరి మధ్య మాయావతి గారు ఓ ఒయాసీస్లా కనబడ్డారు. జనసేన పార్టీ, బీఎస్పీ, వామపక్ష పార్టీల కూటమి అభ్యర్ధులను గెలిపించండి" అంటూ పిలుపునిచ్చారు. అనంతరం చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి జనసేన కూటమి తరుపున బరిలోకి దిగుతున్న ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్ధులను సభకు పరిచయం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout