టీఆర్ఎస్కు భారీ షాక్.. ఇప్పుడిక కేసీఆర్ వంతు..!
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి వరుస షాక్లు తగిలిన విషయం విదితమే. ఇప్పుడు టీఆర్ఎస్ వంతు వచ్చింది. ఇన్ని రోజులూ పార్టీలోని అసమ్మతి నేతలను మేనేజ్ చేసుకుంటూ వస్తున్న గులాబీ పార్టీకి ఇప్పుడు ఎదురుదెబ్బలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నాడు పార్టీకి చెందిన కీలక నేత, సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అధికార పార్టీకి చెందిన నేత రాజీనామా చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన సత్యనారాయణ పార్టీపై, కొందరు నేతలపై సంచలన కామెంట్స్ చేశారు.
అరాచకం పెరిగిపోయింది!
"టీఆర్ఎస్లో అరాచకం పెరిగిపోయింది. టీఆర్ఎస్లో క్రమశిక్షణ లేకుండా పోయింది. అందుకే నేను పార్టీని వీడుతున్నాను. నాపై.. నా అనుచరులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారు. నా ఓటమికి బాల్క సుమన్ కారణం. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారు. గులాబీ బాస్ కేసీఆర్.. అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. కొందరి వల్లే టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నాను. పార్టీలో గౌరవం లేనప్పుడు పనిచేయడం చాలా కష్టం" అని సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. అంతటితో ఆగని ఆయన తాను ఏమైనా తప్పు చేసుకుంటే కేసీఆర్ తనను క్షమించాలని ఈ సందర్భంగా కోరారు. అయితే రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని మాత్రం సోమారపు వెల్లడించలేదు. కాగా.. ముందస్తు ఎన్నికల్లో రామగుండం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2009లో సోమారపు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
మొత్తానికి చూస్తే నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లే అనుకుంటే ఇప్పుడు అధికార టీఆర్ఎస్కు కూడా సోమారపుతో స్టార్ట్ అయ్యాయన్న మాట. మరోవైపు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారు. ఈ తరుణంలో మున్ముంధు గులాబీ పార్టీకి ఎన్నెన్ని షాక్లు తగులుతాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments