17 నుంచి విదేశాల్లో 'శివమ్'

  • IndiaGlitz, [Friday,August 14 2015]

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'శివమ్'. రామ్ ఎనర్జీ లెవల్స్కి తగ్గ కథతో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఈ నెల 17 నుంచి నార్వే, స్వీడన్ లో పాటలు చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. అక్కడి అందమైన పరిసర ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకూ మూడు పాటలు చిత్రీకరించనున్నారు.

ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - "కథాబలం ఉన్న చిత్రం ఇది.స్ర్కీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. మంచి హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి'' అని చెప్పారు.

బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.