Sharmila: YCP అంటే వైవీ.. సాయిరెడ్డి.. రామకృష్ణారెడ్డి.. షర్మిల సెటైర్లు..

  • IndiaGlitz, [Saturday,January 27 2024]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సారే లేరని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఇప్పుడు ఉన్నది YSR పార్టీ కాదని.. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని సెటైర్లు వేశారు. మీది జగన్ రెడ్డి పార్టీ అని.. నియంత పార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతుంటే వైసీపీ నేతలు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని మండిపడ్డారు. సొంత మనషులు అనుకుని 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. వైసీపీ కోసం నా రక్తం దారపోశా.. నా చెమటను దారపోశా... అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుందని వాపోయారు.

మీరు ఎన్ని రకాలుగా తన మీద దాడుదలు చేసినా భయపడే ప్రసక్తే లేదని.. తాను వైఎస్సార్ బిడ్డనని తెలిపారు. అంతకుముందు గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. జలయజ్ఞం కింద వైఎస్‌ఆర్‌ నిర్మిస్తే.. జగన్‌ ప్రభుత్వం దానిని నిర్వహణ కూడా చేయలేకపోతోందని విర్శించారు. వైయస్‌ వారసులమని చెప్పుకునే వారు గేట్లు ఊడిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. లక్ష ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ గుండ్లకమ్మ అని.. అలాంటి ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని చెప్పారు. ఇక్కడ గేట్లు ఊడిపోతుంటే నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్స్‌లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగనన్న అంటున్నారని... ఇదేనా ఆశయాలను నిలబెట్టడం? అని విమర్శించారు. అలాగే మతతత్వ పార్టీ బీజేపీని వైఎస్సార్ పూర్తిగా వ్యతిరేకించారని.. జగన్ మాత్రం బీజేపీకి తొత్తుగా మారారని విమర్శలు చేశారు. వైఎస్సార్ పాలనకు జగనన్న పాలనకు నక్కకు.. నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఏపీలో బీజేపీ అంటే.. B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్ అని వివరించారు. ఈ మూడు పార్టీల్లో ఎవరికీ ఓటు వేసిన బీజేపీకి వేసినట్లేనని ఆమె ఆరోపించారు .

ఇక వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభపైనా ఆమె విమర్శలు చేశారు. యుద్ధానికి తాను సిద్ధం.. మీరు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వైఎస్సార్ బిడ్డగా ప్రజలకు న్యాయం చేయాలనే రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి.. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి... విశాఖ స్టీల్ ఉండాలి. ఉద్యోగాలు రావాలి అని షర్మిల తెలిపారు. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.