2.0తో మారుతున్న శంకర్

  • IndiaGlitz, [Saturday,October 28 2017]

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌.. తొలి చిత్రం జెంటిల్‌మేన్ నుంచి గ‌త చిత్రం ఐ వ‌ర‌కు ఏ చిత్రం విష‌యంలోనూ బ‌డ్జెట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాలేదు. ఇక తాజా చిత్రం 2.0 ని దాదాపు రూ.450 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. భార‌తీయ సినిమాల్లో.. ఇంత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా బ‌హుశా 2.0 అనే చెప్పాలి.

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్‌, విదేశీ సోయ‌గం అమీ జాక్స‌న్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. ఈ చిత్రం ఆడియో వేడుక‌.. శుక్ర‌వారం దుబాయ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. స‌హ‌జంగా శంక‌ర్ సినిమాలు కాస్త ఎక్కువ నిడివి(170 నిమిషాలు.. అంత‌కు మించి)తోనే ఉంటుంటాయి. అయితే 2.ఓ విష‌యంలో అది కాస్త మిన‌హాయింపుగా ఉంటుంద‌ని తెలిసింది. కేవ‌లం 140 నిమిషాలు మాత్ర‌మే ఈ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. ఇప్ప‌టి ప్రేక్ష‌కులు రెండున్న‌ర గంట‌ల‌లోపు ఉండే సినిమాల‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్న నేప‌థ్యంలో.. 2.0కి అది క‌చ్చితంగా ప్ల‌స్ అవుతుంద‌నే చెప్పాలి. 2.0 జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది.