Shah Rukh Khan:బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ భద్రత Y ప్లస్ కేటగిరీకి పెంపు..

  • IndiaGlitz, [Monday,October 09 2023]

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. ఈ రెండు సినిమాలు రూ.1000కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించాయి. దీంతో షారుఖ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు లేఖలు వస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి షారుఖ్ ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆయనకు భద్రతను Y ప్లస్ సెక్యూరిటీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో 11 మంది భద్రతా సిబ్బంది షారుఖ్ భద్రతను చూసుకుంటారు. వీరిలో ఆరుగురు కమెండోలు కాగా, మిగిలిన ఐదుగురు రాష్ట్ర వీఐపీ సెక్యూరిటీ వింగ్‌కు చెందినవారు.

24 గంటల పాటు షారుఖ్ భద్రత పర్యవేక్షణ..

పఠాన్ సినిమా సమయంలోనూ ఆయనకు బెదిరింపులు రాగా ప్రభుత్వం ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సెక్యూరిటీగా ఏర్పాటు చేసింది. దీనికి తోడు సొంత బాడీగార్డ్స్ ఎలాగో ఉన్నారు. ఇప్పుడు జవాన్ సినిమా తర్వాత బెదిరింపులు మరింత ఎక్కువ కావడంతో ఆయన భద్రతను Y ప్లస్ కేటగిరీకి పెంచారు. షారుక్‌కు ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది ఎంపీ-5 మెషీన్ గన్స్, ఏకే 47 అస్సాల్ట్ రైఫిల్స్, గ్లోక్ పిస్టళ్లను కలిగి ఉంటారు. అలాగే 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పని చేసే ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులను నియమించారు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు కూడా Y ప్లస్ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 22న 'డంకీ' చిత్రం విడుదల..

ఇక షారుఖ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'పఠాన్' సినిమా రూ.1000కోట్లు వసూలు చేయగా.. గత సెప్టెంబర్ 7వ తేదీన విడుదలైన 'జవాన్' మూవీ రూ.1100కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక క్రిస్మస్ కానుకగా షారుఖ్ నటించిన 'డంకీ' చిత్రం డిసెంబర్ 22న విడుదల కానుంది.