48 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన హీరో ప్రశాంత్

  • IndiaGlitz, [Tuesday,March 22 2022]

పెళ్లి ఎవరి జీవితంలోనైనా అత్యంత కీలకమైనది. అనుకోని కారణాలు, మనస్పర్థల కారణంగా విడిపోయి ఒంటరిగా వున్నా ఓ తోడు కోసం తపించిపోయేవాళ్లు ఎందరో. అయితే ఇందుకు చాలా ధైర్యం కావాలి. సన్నిహితులు సుముఖంగానే వున్నా.. సమాజం సూటిపోటి మాటలకు భయపడి రెండో పెళ్లి చేసుకునేందుకు చాలా మంది ముందుకు రారు. అయితే పరిస్థితులు మారుతుండటంతో మధ్య వయసులోనూ రెండో పెళ్లి చేసుకునేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇందుకు సినీ రంగం కూడా అతీతం కాదు. సింగర్ సునీత, నిర్మాత దిల్‌రాజ్ వంటి వారు చూపిన దారిలో ఎంతోమంది నడుస్తున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరబోతున్నారు సీనియర్ హీరో ప్రశాంత్. తమిళ నిర్మాత త్యాగరాజన్‌ వారసుడిగా ఇండస్ట్రీలో ఇంట్రీ ఇచ్చి తనకుంటూ గుర్తింపు సంపాదించుకున్నారు ప్రశాంత్‌. జీన్స్‌, దొంగ దొంగ, జోడీ వంటి సినిమాలతో దక్షిణాదిలో సంచలనం సృష్టించిన ప్రశాంత్.. కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంధాదూన్‌ రీమేక్‌లో నటిస్తున్నాడు ప్రశాంత్.

ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. త్వరలోనే ప్రశాంత్‌ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఆయన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. కాగా 2005లో వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మితో ప్రశాంత్‌ పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా పెళ్లయిన మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. నాటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ప్రశాంత్‌.. కుటుంబానికి సన్నిహితులైన వారి అమ్మాయిని పెళ్లాడనున్నాడట. మరి ఇందులో ఎంత నిజం వుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.