Renu Desai:మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు .. ‘‘కొందరు’’ అంటూ రేణూ దేశాయ్ పోస్ట్, వైరల్
- IndiaGlitz, [Tuesday,April 04 2023]
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రేణూ దేశాయ్. ఈ సినిమా సమయంలో పవన్-రేణూ మధ్య ప్రేమ చిగురించడంతో ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అనంతరం పెళ్లి పీటలెక్కారు. ఈ దంపతులకు అకీరా నందన్, ఆద్యా సంతానం. అయితే అనుకోని కారణాలతో వీరిద్దరూ వీడిపోగా.. పవన్ కల్యాణ్ ఉక్రెయిన్కు చెందిన అన్నాలెజ్నోవాను పెళ్లాడారు. కానీ రేణూ మాత్రం ఒంటరిగా పిల్లలతో కలిసి వుంటున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా వుంటున్న రేణూ దేశాయ్.. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న ‘‘టైగర్ నాగేశ్వరరావు’’తో లాంగ్ గ్యాప్ అనంతరం తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
ఆరోగ్యం బాలేదంటూ పోస్ట్ పెట్టిన రేణూ దేశాయ్ :
ఇదిలావుండగా.. కొంతకాలం క్రితం తాను గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. వీటిని ఎదుర్కొంనేందుకు ప్రయత్నిస్తున్నట్లు రేణూ స్వయంగా చెప్పారు. జీవితంలో ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా .. ఎవ్వరూ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదని ఆమె సూచించారు. సమస్య ఏదైనా నవ్వుతూ ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి.. నేను కూడా ఇప్పుడు నా అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నా, మందులు వాడుతున్నా, యోగా చేస్తున్నానని రేణూ దేశాయ్ తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని షూటింగ్లకు హాజరవుతానని ఆమె స్పష్టం చేశారు.
వారి ప్రభావం జీవితాంతం వుంటుందన్న రేణూ దేశాయ్:
తాజాగా రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్లని గాలిలా ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. వారి చూపులు నేరుగా మన మనస్సుతో మాట్లాడతాయి. అది అద్భుతమైన భాష. మనం వాళ్లతో కొన్ని గంటల సమయం గడిపినప్పటికీ.. వారి ప్రభావం మన జీవితాంతం వుంటుంది. అయితే వాటిలో కొన్ని పరిచయాలు బాధపెడతాయి కూడా.. కానీ ఇంకొందరు మాత్రం మన జీవితాల్ని పరిపూర్ణం చేస్తారు. మన కన్నీటిని తుడిచి మన జీవితంలో మరింత కాంతిని పంచుతారు ’’ అంటూ రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమెను ఆనందంగా వుంచిన, కన్నీటిని తుడిచిన, కంటతడి పెట్టించిన వ్యక్తి ఎవరు అన్న కోణంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరిని ఉద్దేశిస్తూ రేణూ దేశాయ్ ఈ పోస్ట్ పెట్టారన్న కోణంలో చర్చ జరుగుతోంది.