Lok Sabha: లోక్‌సభలో తీవ్ర భద్రత వైఫల్యం.. సభలోకి ప్రవేశించిన ఆగంతకులు..

  • IndiaGlitz, [Wednesday,December 13 2023]

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో తీవ్ర భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. లోక్‌సభ జరుగుతున్న సమయంలో విజిటింగ్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు ఆగంతకులు సభలోకి ఒక్కసారిగా ప్రవేశించారు. దీంతో ఉలిక్కిపడిన పార్లమెంట్ సభ్యులు బయటకు పరుగులు తీశారు.

ఎంపీలు కూర్చునే టేబుళ్ల మీదకి ఎక్కిన ఆగంతుకులు నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేయడంతో ప్యానెల్ స్పీకర్ రాజేందర్ సభనను వాయిదా వేశారు. ఈ అనూహ్య ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు, భద్రతా సిబ్బంది చుట్టుముట్టి వారిని పట్టుకున్నారు. వీరిలో ఓ మహిళ ఉండటం గమనార్హం. ఆగంతకులను నీలం(42), అమోల్ షిండే (25)గా గుర్తించారు.

22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఉగ్రవాదులు పార్లమెంట్ మీద దాడి చేశారు. ఇప్పుడు సరిగ్గా ఇదే రోజున మళ్లీ ఆగంతకులు సభలోకి చొచ్చుకుని వెళ్లి టియర్ గ్యాస్ ప్రయోగించడం కలకలం రేపుతోంది. భద్రతా వైఫల్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని విపక్ష ఎంపీలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి దాడికి గల కారణాలను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

కాగా 2003 డిసెంబరు 13న పాక్ ఉగ్రవాదులు పార్లమెంట్‌లోకి చొరబడేందుకు జరిపిన దాడిలో 9 మంది అమరులయ్యారు. ఉగ్రదాడిలో అమరులైన వారి కోసం సంస్మరణ సభను పార్లమెంట్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకెళ్లారు.