ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

  • IndiaGlitz, [Saturday,January 29 2022]

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అనేక చోట్ల నైట్ కర్ఫ్యూలు, బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమిగూడటంపైనా ఆంక్షలు విధించాయి. అలాగే విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కోవిడ్ బారినపడుతుండటంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు స్కూళ్లను మూసివేసి.. ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో తెలంగాణ కూడా వుంది.

సంక్రాంతి పండగ నేపథ్యంలో జనవరి 8 నుంచి 16 వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే రాష్ట్రంంలో కరోనా కేసుల తీవ్రత కారణంగా సెలవులను 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం కేసులు అదుపులోనే వుండటంతో స్కూళ్లు తెరుస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. దీనిపై హైకోర్టు విచారించగా... 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది.

దీనిలో భాగంగా .. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రకటించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించింది సర్కారు. పాఠశాలల పునఃప్రారంభంపై స్పష్టమైన వైఖరి చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. వీటివల్ల పెద్దగా ఉపయోగం లేదని, వెంటనే విద్యాసంస్థలు తెరవాలని పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం.. హైకోర్టు జోక్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.