ఎస్సీ-ఎస్టీలకు రాజకీయ అధికారం దక్కలేదు!
- IndiaGlitz, [Friday,April 05 2019]
తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పొరాడి తెచ్చుకుంటే... అవేవీ ఆచరణలో నెరవేరలేదు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆకాంక్షలు నెరవేర్చలేకపోయింది అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహుజనసేన యుద్దభేరి బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. పెద్దగా ఎలాంటి అభివృద్ధి లేదు. తెలంగాణలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నా వారికి రాజకీయ అధికారం దక్కలేదనీ, 2 శాతం ఉన్న వర్గమే రాజ్య మేలుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అన్యాయం జరిగిందో ప్రస్తుత తెలంగాణకు ఇక్కడి పాలకులు అలాంటి అన్యాయమే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలు అన్నింటా నిరాదరణకు గురవుతున్నారు. డా.అంబేడ్కర్ కలలు నెరవేరలేదు. ఆ మహనీయుడు ఆశించిన రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందకపోవడానికి పాలకుల తీరే కారణం. దళితులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఆ ఫలాలు అందుతాయి అని మాయావతి చెప్పుకొచ్చారు.
అచ్చే దిన్ ఏవీ..
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అచ్చే దిన్ అన్నారు.. కానీ అణగారిన వర్గాల ప్రజలు, ముస్లింలకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. అచ్చే దిన్ ఎక్కడో బీజేపీవాళ్ళు చెప్పగలరా? ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ హయాంలో పేదలు అలాగే ఉండిపోయారు. ఇప్పుడు పేదలకు ఖాతాల్లోకి రూ.72వేలు వేస్తాం అని అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పవన్ ముఖ్యమంత్రి అవుతారని విశ్వసిస్తున్నాను. ఆ పదవికి ఆయన అన్ని విధాలా యోగ్యుడు. తెలంగాణలోనూ బీఎస్పీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయిఅన్నారు.