ప్లాన్‌ మార్చుకున్న 'సర్కారు వారిపాట'

  • IndiaGlitz, [Monday,December 07 2020]

సూపర్‌స్టార్‌ మహేశ్‌, పరుశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మహేశ్‌ 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ నిర్మిస్తున్నాయి. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే పూర్తి స్థాయి షూటింగ్‌ జనవరిలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాను మొదటి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించాలని ముందుగా అనుకున్నారు. అయితే, ప్రస్తుతం సినిమా ప్లానింగ్‌ పూర్తిగా మారిందట.

అదేంటంటే జనవరి నుండి అమెరికా షెడ్యూల్‌ మినహా మిగతా పార్ట్‌ను ముందుగా చిత్రీకరించాలని మహేశ్‌ అండ్‌ టీమ్‌ నిర్ణయించుకుందట. అమెరికా షెడ్యూల్‌ను మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో చిత్రీకరించాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. అమెరికాలో కోవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టకపోవడమేనని టాక్‌. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ దక్కించుకున్న మహేశ్‌.. సర్కారు వారి పాట చిత్రాన్ని ఎప్పుడో స్టార్ట్‌ చేయాల్సింది. కానీ కోవిడ్‌ కారణంగా సినిమా షూటింగ్ స్టార్ట్‌ కావడానికి సమయం పడుతూ వస్తుంది. ఇందులో మ‌హేశ్ ఎన్నారై బిజినెస్ మేన్‌గా, ఫైనాన్సియ‌ర్‌గా.. ఇలా రెండు షేడ్స్‌లో క‌నిపిస్తార‌ని సమాచారం. రీసెంట్‌గా ఈ చిత్రంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తారని కూడా వార్తలు వినిపించాయి.